విషాదం: కారు ప్రమాదంలో యువతి మృతి, యువకుడికి గాయాలు, పబ్బులో మద్యం సేవించి..
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వోల్వో కారులో ఇద్దరు విద్యార్థులు బంజరాహిల్స్ నుంచి లింగంపల్లి వైపు వెళ్తుండగా సెంట్రల్ యూనివర్సిటీ గేట్ 2 వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్టును వేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రియాంక(20) అక్కడికక్కడే మృతి చెందగా, మిత్తి మోడీ అనే యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
ప్రమాద సమయంలో ఇద్దరూ సీటు బెల్ట్ పెట్టుకోలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న మిత్తి మోడీ మద్యం తాగి ఉన్నాడు.
జూబ్లీహిల్స్లోని ఎయిర్ లైఫ్ పబ్లో యువతీ, యువకుడు మద్యం సేవించినట్లు తెలిసింది. మిత్తి మోడీకి బ్రీత్ అనలైజ్ టెస్టు చేయగా, 45 శాతం నమోదైంది. పబ్బులో మద్యం సేవించాక గచ్చిబౌలి వైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై ప్రియాంక తల్లి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మిత్తి మోడీ విశాఖపట్నంలో డిగ్రీ చదువుతున్నాడని గుర్తించారు. అతడు ఓ ప్రముఖ వ్యాపారి కుమారుడని సమాచారం. హైదరాబాద్ ఎందుకు వచ్చాడని పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, ప్రియాంక జార్జియాలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ వచ్చి.. ఇక్కడే ఉంటున్నారు. ఇంటికి వచ్చి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ప్రియాంక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.