విషాదం : ఇద్దరు సోదరులు,సోదరి... కొత్త ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య... కారణమదే...
హైదరాబాద్లోని పురానాపూల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు సోదరులు,సోదరి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తోంది. ఇద్దరు సోదరుల్లో ఒకరు ఆత్మహత్యకు ముందు తన మిత్రుడు ఒకరికి ఫోన్ చేసి 'మీకిదే నా చివరి ఫోన్' అని చెప్పినట్లు సమాచారం. అయితే ఆ మిత్రుడు అతని మాటలను అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ కాసేపటికి అనుమానం వచ్చి తిరిగి కాల్ చేయగా... అటు వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఆ ఇంటికి వెళ్లేసరికి అప్పటికే ఆ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అసలేం జరిగింది..
పురానాపూల్లోని చంద్రికాపురానికి చెందిన కొమరాల లింగేశ్వరరావు,ఆయన భార్యకు ముగ్గురు సంతానం. లింగేశ్వరరావు,ఆయన భార్య పద్నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వీరి పెద్ద కుమారుడు కె.మధుసూదన్ రావు(38) ఎల్ఐసీ ఏజెంట్. చిన్న కుమారుడు సందీప్ కుమార్(35) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. కుమార్తె ప్రేమలత(36) ఇంట్లోనే ఉంటున్నారు. ఈ ముగ్గురికీ ఇంకా వివాహం కాలేదు. ఇల్లు కట్టుకున్నాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అప్పుల భారం... 7 నెలలుగా ఇంటికి దూరంగా
తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ కష్టపడి తమ చదువులు పూర్తి చేశారు. బస్తీలో చుట్టుపక్కల వాళ్లతో చాలా కలుపుగోలుగా ఉండేవారు. ఏడాదిన్నర క్రితం తమ పాత ఇంటిని కూల్చివేసి రెండంతస్తుల భవనం నిర్మించారు. అయితే ఇందుకోసం చేసిన అప్పు వారికి భారంగా మారింది. అప్పులు తీరిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో కరోనా,లాక్ డౌన్ల కారణంగా సంపాదన తగ్గిపోయింది. అదే సమయంలో చేసిన అప్పుకు వడ్డీ పెరుగుతూ వస్తోంది. అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక గత 7 నెలలుగా ముగ్గురు ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు.

ఉరేసుకుని ఆత్మహత్య...
ఇటీవల తమ కొత్త ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు... అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. శుక్రవారం(మే 21) సందీప్ కుమార్ బేగం బజార్లోని తన మిత్రుడు గోవింద్ సింగ్(35)కి ఫోన్ చేశాడు. 'పొరపాటు నిర్ణయం తీసుకున్నాం.. మీకిదే నా చివరి ఫోన్ కాల్...' అని చెప్పాడు. గోవింద్ సింగ్ ఆ మాటలను అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ కాసేపటికి తిరిగి ఫోన్ చేయగా అటువైపు నుంచి స్పందన లేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఆ ఇంటికి వెళ్లేసరికి ముగ్గురు ఉరేసుకుని కనిపించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications