డాక్టర్ వర్సెస్ డాక్టర్! ముంబై తరహా గన్ కల్చర్: హైద్రాబాద్లో కొన్ని ఘటనలు
హైదరాబాద్: ముంబై తరహా కాల్పుల ఘటనలు హైదరాబాద్లోనూ జరుగుతున్నాయని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కార్పొరేటు ఆసుపత్రి ప్రారంభం, వాటాల పరంగా విభేదాల రావడంతో డాక్టర్ ఉదయ్ కుమార్ను శశి కుమార్ తుపాకీతో కాల్చిన సంఘటన సంచలనం రేపుతోంది.
బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమాయుధాలు వస్తున్నాయి. అక్రమాయుధాలకు ఇక్కడ గిరాకీ బాగా ఉండటంతో అక్కడి కర్మాగారాల్లో తయారవుతున్న వాటిని తీసుకొస్తున్నారు. ఉపాధి నిమిత్తం అక్కడి నుంచి వచ్చి సెక్యూరిటీ గార్డులుగా స్థిరపడిన యువకులు దీన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారట.
హైదరాబాదులో కొన్ని సంఘటనలు...
నవంబర్ 2014 - అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డి పైన దుండగులు ఏకే 47తో కాల్పులు జరిపారు.
ఏప్రిల్ 2015 - సరూర్ నగర్ జింకలబావి ప్రాంతంలో జ్యోతిష్యుడు తూరపాటి నాగరాజుపై పట్టపగలు 11.30 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన షార్ప్ షూటర్లు దీనికి పాల్పడ్డారు. బైక్ పైన వచ్చిన ఈ కిరాయి హంతకులు నాగరాజుపై 4 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.
మార్చి, 2015 - నల్గొండ జిల్లా సూర్యాపేట, జానకిపూర్ గ్రామంలో పోలీసులపై కాల్పులు జరిపి చివరికి హతమైన సిమి ఉగ్రవాదులు అస్లాం, ఎజాజ్ నగరంలోని చాదర్ఘాట్ నుంచే వెళ్లారు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడే ఆయుధాలతో సహా బస్సెక్కారు.
మే, 2015 - మల్లాపూర్లో ఉండే అఖిలేష్ దేశీవాళీ ఆయుధంతో సంచరిస్తూ సికింద్రాబాద్ పారడైజ్ వద్ద పోలీసులకు చిక్కాడు. బీహార్ నుంచి వచ్చి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ మల్లాపూర్ వాసవినగర్లో ఉండే ఇతడు ఆయుధాన్ని విక్రయించేందుకు వచ్చి దొరికిపోయాడు.
మే, 2015 - యూసుఫ్గూడలోని ఏటీఎంలో యువతిని బెదిరించేందుకు శివకుమార్ రెడ్డి అనే దుండగుడు దేశవాళీ తుపాకితో కాల్పులు జరిపాడు.