బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 22 లక్షలు మాయం: చోరీ చేసింది తానేనంటూ మాటమార్చిన క్యాషియర్
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ కేసు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. డబ్బులు తానే తీసుకెళ్లానని, క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి నష్టపోయానని.. మళ్లీ బెట్టింగ్లో పెడతానని అవి వస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ బ్యాంక్ మేనేజర్ కు క్యాషియర్ ప్రవీణ్ కుమార్ మొదట మెసేజ్ చేశారు.
అయితే, తాజాగా, బ్యాంక్ నుంచి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ క్యాషియర్ ప్రవీణ్ కుమార్ సెల్ఫీ వీడియో పంపాడు. డబ్బు తానే తీసుకెళ్లానని చెప్పిన ప్రవీణ్ ఇప్పుడు మాటమార్చడంతో బ్యాంకులో చోరీకి గురైన డబ్బు ఎక్కడికెళ్లిందనే ప్రశ్న మొదలైంది.
బ్యాంకులో నగదు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై పడేస్తున్నారని.. బ్యాంక్ మేనేజర్, సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయాడు ప్రవీణ్. గతంలోనూ పలుమార్లు నగదు తక్కువగా ఉండటంపై నిలదీసినా మేనేజర్ పట్టించుకోలేదని తెలిపాడు. బ్యంక్ మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతోందని, అనవసరంగా తనను బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించాడు.
బ్యాంకులో సరైన నిఘా లేదని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ ఆ వీడియోలో తెలిపాడు. మొదట తానే నగదు తీసుకెళ్లానని, ఇప్పుడు తాను కాదని ప్రవీణ్ చెబుతుండటంతో అసలు ఏం జరిగిందనే విషయం ఉత్కంఠగా మారింది.
వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు రోజుల క్రితం రూ. 22.53 లక్షల నగదు తీసుకుని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పరారయ్యాడు. రోజులాగే డ్యూటీకి వచ్చాడు. కొంతసేపటి తర్వాత తనకు కడుపునొప్పి వస్తుందని మేనేజర్కు చెప్పి.. టాబ్లెట్స్ తెచ్చుకుంటానని బయటికి వెళ్లాడు. ఆ తర్వాత బ్యాంకుకు ప్రవీణ్ తిరిగిరాలేదు.
సాయంత్రం వరకు ప్రవీణ్ తిరిగి రాకపోవడంతో బ్యాంక్ క్లోజ్ చేసే సమయంలో మేనేజర్ అకౌంట్ చెక్ చేశాడు. నగదులో రూ. 22.53 లక్షలు తక్కువగా వచ్చినట్లు తేలింది. దీంతో క్యాషియర్ కు ఫోన్ చేయగా.. ప్రవీణ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎన్నిసార్లు చేసిన ప్రవీణ్ స్పందించకపోవడంతో.. చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.