తన ఛానల్ కు వ్యూస్ పెరగడంలేదని.. భవనం పైనుండి దూకి హైదరాబాద్ యూట్యూబర్ సూసైడ్
హైదరాబాద్: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన యూట్యూబ్ ఛానల్ కు ఎక్కువ వ్యూస్ రావడం లేదంటూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే...

యూట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రాకపోవటంతో ఆందోళన.. సూసైడ్ నోట్ యూ ట్యూబ్ లో పెట్టిన యువకుడు
యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ధీనా అనే యువకుడు ఐఐటీ గ్వాలియర్ లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ చదువుతూనే లైవ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ధీనా సెల్ఫ్ ఫ్లో పేరుతో యూట్యూబ్ ఆన్లైన్ గేమింగ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్ గేమ్ లు ఆడుతూ తన వీక్షకులను పెంచుకున్న ధీనా, గత కొంత కాలంగా తనకు వ్యూవర్స్ పెరగడం లేదంటూ ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలోని గేమ్ ఆడుతూ తన బాధను చెప్పుకున్న ధీనా తన సూసైడ్ నోట్ ను యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేశాడు. తనలాగా ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొన్నాడు.

భవనం పైనుండి దూకి ఆత్మహత్య
అందులో తన చిన్నతనం నుంచి ఎదుర్కొన్న అవమానాలు, బాధలు రాసుకున్నాడు. తాను చిన్నప్పుడే అనేక బాధలు పడ్డట్టు పలు కీలక విషయాలను ధీనా పేర్కొన్నాడు. చిన్నప్పుడే తాను రేప్ కు గురైనట్టు లేఖలో పేర్కొన్నాడు ధీనా. తనను తల్లిదండ్రులు కూడా అశ్రద్ధ చేశారని, ఎవ్వరూ ప్రేమగా చూడలేదని లేఖలో తెలిపాడు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్ లైవ్ లో గేమ్ ఆడిన ధీనా భవనంపై నుంచి క్రిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సూసైడ్ నోట్ లో కీలక విషయాలు చెప్పిన ధీనా
యూట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రాకపోవడం ఆత్మహత్య చేసుకునేంత పెద్ద కారణం కాదు. అయినప్పటికీ ధీనా గేమింగ్ యూట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రాకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ధీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అంతేకాదు ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 164 కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిన్న చిన్న కారణాలకే సూసైడ్ వంటి తీవ్ర నిర్ణయాలు
ఇక యూట్యూబర్ ధీనా ఆత్మహత్యకు యూట్యూబ్ ఛానల్ మాత్రమే కారణం కాదని, అతను రాసిన లేఖను బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా ఆందోళన కలిగిస్తుంది. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకోవడం సమాజంలో ఆందోళనకర పరిణామం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రుల పైన, అలాగే సమాజం పైన ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications