సానియా, సింధులకైతే అలా..: కెసిఆర్కు మిథాలీ రాజ్ పట్టదా?
సానియా మీర్జా, సింధులకు వరాల జల్లు కురిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ను ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది.
హైదరాబాద్: సానియా మీర్జా, సింధులకు వరాల జల్లు కురిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ను ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిథాలీ రాజ్ పేరు మారుమోగుతోంది.
మహిళా క్రికెట్ జట్టును ఫైనల్ దాకా చేర్చిన ఘనత ఆమెదే. పైగా, అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్గా రికార్డు సాధించింది. ఆమెకు తన సొంత నగరం హైదరాబాదులోనే తగిన గుర్తింపు లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఆమెకు 2005లో500 గజాల స్థలం ఇస్తామని అప్పటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.
16 ఏళ్ల వయస్సులోనే....
హైదరాబాదుకు చెందిన మిథాలీ రాజ్ 16 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు ఆమెకు 34 ఏళ్ల వయస్సు. ఇటీవలి మహిళా ప్రపంచ క్రికెట్ పోటీల్లో భారత జట్టును ఫైనల్కు చేర్చింది. ఆమెను మహిళా క్రికెట్లో సచిన్ టెండూల్కర్తో పోలుస్తారు. అయితే, ఆమె ప్రతిభను వరుసగా వస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలేవీ గుర్తించడం లేదు.
Recommended Video
మిగతా రాష్ట్రాలు ఇలా...
ప్రపంచ మహిళా క్రికెట్ జట్టుకు తమ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డడులు ప్రకటించాయి. హర్మీత్ కౌర్కు పంజాబ్ ప్రభుత్వం, సుష్మా వర్మకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం డిఎస్పీ పోస్టులు ఇస్తున్నాయి. మిథాలీ రాజ్ విషయంలో మాత్రం కెసిఆర్ ప్రభుత్వం మౌనం వహిస్తోంది.
సానియా, సింధులకు ఇలా...
సానియా మీర్జాను కెసిఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించి పెద్ద యెత్తున నగదు బహుమతి కూడా ఇచ్చారు. పివి సింధుకు రెండు తెలుగు రాష్ట్రాలు రివార్డులు ప్రకటించాయి. చంద్రబాబు ప్రభుత్వం సింధుకు డిప్యూటీ కలెక్టర్ పదవి కూడా ఇచ్చింది. వారికి ఇవ్వకూడదని కాదు గానీ మిథాలీ రాజ్ను కెసిఆర్ ఎందుకు విస్మరిస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సానియాకు కెసిఆర్ ప్రభుత్వ రూ. 2 కోట్లు ఇచ్చింది. పివి సింధుకు రూ. 5 కోట్లతో పాటు 1000 చదరపు గజాల స్థలం కూడా ఇచ్చింది.
ఇలా హామీ ఇచ్చారు...
మహిళా ప్రపంచ కప్ పోటీల్లో 2005లో మిథాలీ రాజ్ అత్యధిక పరుగులు సాధించింది. ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయితే, అసాధారణ ప్రతిభ చూపిన మిథాలీ రాజ్కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిి, 500 గజాల ఇంటి స్థలాన్ని హామీ ఇచ్చింది. కుత్బుల్లాపూర్లో స్థలాన్ని కూడా గుర్తించినట్లు సమాచారం. కానీ, అది మిథాలీ చేతికి రాలేదు.
ఎంతగా తిరిగినా....
తమ కూతురికి ఇవ్వదలచిన ఇంటి స్థలం కోసం మిథాలీ తల్లిదండ్రులు లీలా రాజ్, దొరై రాజ్ ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. కానీ నిరాశే ఎదురైంది. వైయస్ రాజశేఖర రెడ్డిని మిథాలీ, ఆమె తల్లి ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు కలిసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాల తీరుతో విసిగిపోయిన మిథాలీ రాజ్ దాని కోసం తిరగవద్దని తల్లిదండ్రులకు చెప్పినట్లు ఓ ప్రముఖ మీడియా వార్తాకథనం సారాంశం.
క్రికెట్ ప్లేయరు కదా అనుకుంటే....
మిథాలీరాజ్ తల్లిదండ్రులు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ స్థలం కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా క్రికెటర్ కావడం వల్ల తమకు సాయపడవచ్చునని వారు అనుకుని ఉంటారు. కానీ ఫలితం దక్కలేదు.