రూ. 10 వేల కోట్లు ఉన్నాయని చెప్పిన హైదరాబాదీ: ముఖం చాటేశాడు
హైదరాబాదులోనూ ఓ మహేష్ షా ఉదంతం బయటకు వచ్చింది. తన వద్ద పది వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పిన హైదరాబాద్ వ్యక్తి ఒకతను ఇప్పుడు చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఆదాయం వెల్లడి పథకం (ఐడిఎస్) కింద తన వద్ద పది వేల రూపాయలు ఉన్నాయని చెప్పిన ఓ హైదరాబాదీ ఉదంతం ఇప్పుడు మిస్టరీగా మారింది. హైదరాబాద్కు చెందిన వ్యక్తి 10 వేల కోట్లను ఐడీఎస్ కింద ప్రకటించారనే విషయం అప్పట్లో ఎంత సంచలనం రేపింది. అయితే, ఆయనకు అంత సీన్ లేదని చెబుతున్నారు.
అతని కోసం ఐటి అధికారులు గాలిస్తున్నారు. రెండు నెలల కిందట ముగిసిన ఐడీఎస్ పథకం కింద హైదరాబాద్కు చెందిన బాణాపురపు లక్ష్మణ్రావు 9,800 కోట్ల రూపాయల లెక్క చూపని ఆస్తులను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించారు. ఆయన ఆడిటర్గా చెప్పుకొన్న లక్ష్మీనారాయణ మరో రూ.200 కోట్ల లెక్క చూపని ఆస్తుల వివరాలను చెప్పారు.
అప్పట్లో వారి వివరాలను వెల్లడించలేదు. అయితే హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి 10 వేల కోట్ల రూపాయల విలువైన నల్లధనాన్ని వెల్లడించారని మీడియాకు ఉప్పు అందింది. రాత్రికి రాత్రి 10 వేల కోట్ల రూపాయల విలువైన నల్లధనాన్ని వెల్లడించిన కుబేరుడు ఎవరై ఉంటారా అన్న దానిపై రకరకాల ఊహాగానాలు అప్పట్లో చెలరేగాయి.
ఐడీఎస్ కింద లెక్క చూపని సంపదను వెల్లడించినవారు పన్ను కింద 45 శాతాన్ని వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అయితే, గుజరాతలోని మహేశ్ షా తరహాలోనే లక్ష్మణరావు, లక్ష్మీనారాయణ ఇద్దరూ కూడా తాము చెల్లించాల్సిన తొలి వాయిదా విషయంలో చేతులు ఎత్తేశారు.
దాంతో, డిక్లరేషన్లోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఐటీ అధికారులు మంగళవారం బాణాపురపు లక్ష్మణ్రావు, ఆయన ఆడిటర్ లక్ష్మీనారాయణ ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరిపారు. లక్ష్మణరావు బిజినెస్ టర్నోవర్ 5-10 కోట్ల లోపే ఉంటుందని అంచనా వేశారు. ఫిల్మ్నగర్లో ఆధునిక వసతులతో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు.
కాగా, లక్ష్మీనారాయణ కూడా పేరున్న ఆడిటర్ కాదంటున్నారు. తిరుపతిలో జరుగుతున్న దక్షిణ భారత చార్టెర్డ్ అకౌంటెంట్స్ సభల్లో ఆయన కోసం ప్రయత్నించగా ఎవరూ ఆయనను గుర్తించలేకపోయారు. హైదరాబాద్లో ఈ పేరుతో డజను మందిపైగా ఆడిటర్లున్నారు.
గుజరాత్లో మహేశ్ షా అనే వ్యక్తి రూ.13,860 కోట్లను ఐడీఎస్ కింద ప్రకటించి, పన్ను చెల్లించే దశలో చేతులెత్తేసిన విషయం తెలిసిందే. వీరిలో గుజరాత్ షా, హైదరాబాద్ లక్ష్మణ్ రావు వాటా రూ.25 వేల కోట్లు. ఈ మొత్తం బోగస్ అని వెల్లడైన విషయం తెలిసిందే.