నేను సామాన్యుడినే, సంకల్పం సిద్ధించింది కాబట్టే..: యాగంపై కెసిఆర్
హైదరాబాద్: తాను ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తలపెట్టిన ఆయుత చండీయాగం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు. తెలంగాణ వస్తే ఆయుత చండీయాగం చేస్తామని సంకల్పం తీసుకున్నామని, చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇది మహోత్కృష్టమైన యాగమని ఆయన అన్నారు.
యాగానికి సంబంధించినంత వరకు తాను కూడా సామాన్య కార్యకర్తలాంటివాడినే అని ఆయన చెప్పారు. ఆశయం సిద్ధించింది కాబట్టి యాగం చేస్తున్నామని, నాలుగేళ్ల క్రితమే సంకల్పం తీసుకున్నామని ఆయన చెప్పారు. యాగానికి అందరూ ఆహ్వానితులేనని, ఏ విధమైన ఆంక్షలు లేవని ఆయన చెప్పారు. గంగాపూర్ నుంచి యాగం జరిగే ఎర్రవెల్లి వరకు రెండు దారులుంటాయని, కుడి వైపు నుంచి విఐపిలు వస్తారని, ఎడమ వైపు నుంచి సామాన్యులు వస్తారని ఆయన చెప్పారు.
యాగానికి వచ్చే భక్తులు స్వీయనియంత్రణ పాటించాలని ఆయన చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా లలిత సహస్ర నామ కుంకుమార్చన చేస్తామని ఆయన చెప్పారు. యాగానికి అతిరథమహారథులు, ఆధ్యాత్మికవేత్తలు వస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు గవర్నర్లు నరసింహన్, రోశయ్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు వస్తున్నట్లు తెలిపారు.
అమ్మదయ వల్ల తెలంగాణ వచ్చింది కాబట్టే యాగం చేస్తున్నట్లు తెలిపారు. రుత్విజుల నియమాలు కఠినంగా ఉంటాయి కాబట్టి ఎవరూ తాకవద్దని ఆయన సూచించారు. దీక్షావస్త్రాలు ధరించినవారికి మాత్రమే యాగశాలలోకి అనుమతి ఉంటుందని చెప్పారు. మీడియా పాయింట్ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. యాగం నిర్విఘ్నంగా సాగడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.