వ్యక్తిగతంగా బాధించింది: 'ఉత్తమ్'పై కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ ఏకపక్షంగా నియమించిందని అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల అభిప్రాయాల్ని తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్లో సర్వే చేయించి బలమైన నేతకే తెలంగాణ పిసిసి చీఫ్ పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా ఈ నియామకం తనను బాధించిందని, కొందరు సీనియర్లు కొత్త పిసిసి అధ్యక్షుడికి సహకరించరని కోమటిరెడ్డి తేల్చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, సిఎల్పీ డిప్యూటీ నేతగా పార్టీ కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను తొలగించి.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే.
ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్తో సహా పలువురు సీనియర్ నేతలను కలవనున్నారు. పిసిసి అధ్యక్ష బాధ్యతలు తనకు ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలపనున్నారు.