జగ్గారెడ్డి తేల్చేశారు! పార్టీ వీడొద్దంటూ కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ నేత, వీహెచ్ విజ్ఞప్తి, టీకప్పులో తుఫానే
హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ జరుగుతున్న ప్రచారం తెలంగాణ రాజకీయాలో చర్చనీయాంశంగా మారింది. పార్టీని వీడొద్దంటూ వీ హనుమంతరావు సహా సీనియర్ నేతలు జగ్గారెడ్డిని కోరారు. ఓ కాంగ్రెస్ నేత ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని పార్టీని వీడొద్దంటూ వేడుకున్నాడు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.
పార్టీని వీడొద్దంటూ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ నేత, వీహెచ్ విజ్ఞప్తి
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు శనివారం ఉదయం కలిశారు. కాంగ్రెస్కు దూరం కావొద్దని జగ్గారెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని వీహెచ్ సూచించారు. మరోవైపు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్.. జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమిలాడారు. పార్టీని వీడనంటేనే కాళ్లు విడిచిపెడతానని అన్నారు. దీంతో జగ్గారెడ్డి కొంత మెత్తపడ్డారు.
ప్రస్తుతానికి కాంగ్రెస్ను వీడటం లేదన్న జగ్గారెడ్డి
ఈ క్రమంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీని వీడనని స్పష్టం చేశారు. రాజీనామా చేయొద్దని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరిందని చెప్పారు. అయితే, తనపై పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తన మీద సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నట్లు, దీనిపై పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు.
జగ్గారెడ్డి, తనపై తప్పుడు ప్రచారమంటూ వీహెచ్ మండిపాటు
అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తమ ఫొటోలు మార్ఫింగ్ చేశారని చెప్పారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. ఎన్నికల కమిషన్కు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని వీ హనుమంతరావు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ప్రభావం
కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య విభేదాల నేపథ్యంలోనే జగ్గారెడ్డి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన వలసనేతకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కడంపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రేవంత్ రెడ్డి పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని అన్ని ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇటీవల సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు.