అమిత్ షా టూర్: సహపంక్తి భోజనం.. ప్రజలకు భరోసా (ఫొటోలు)
అడుగులో అడుగేసి.. కష్టసుఖాలు తెలుసుకుని.. సహపంక్తి భోజనం చేసి.. కార్యకర్తల్లో భరోసా నింపి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్లగొండ జిల్లా పర్యటన తొలిరోజు కార్యక్రమం జరిగిన తీరిది.
నల్లగొండ: అడుగులో అడుగేసి.. కష్టసుఖాలు తెలుసుకుని.. సహపంక్తి భోజనం చేసి.. కార్యకర్తల్లో భరోసా నింపి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్లగొండ జిల్లా పర్యటన తొలిరోజు కార్యక్రమం జరిగిన తీరిది.
జిల్లాలో అమిత్ షా మూడు రోజుల పర్యటన సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో అమిత్ షాకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
పొలిమేరల్లో పాతాకావిష్కరణ
ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆయన.. రోడ్డు మార్గంలో చండూరు మండలం తేరటుపల్లి వెళ్లారు. గ్రామంలోకి అడుగు పెట్టగానే పొలిమేరల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కోలాటం, డప్పు చప్పుళ్లు.. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాల నడుమ ఇంటింటి పర్యటనకు శ్రీకారం చుట్టారు.
పార్టీ సీనియర్ నేత విగ్రహావిష్కరణ...
గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, దళితులు, వివిధ వర్గాలతో కలిసి నడిచారు. దాదాపు అరగంటపాటు ఐదుగురి ఇళ్లకు వెళ్లి, ఆయా కుటుంబాలతో మాట్లాడారు. అనంతరం, నక్సలైట్ల కాల్పుల్లో మరణించిన పార్టీ సీనియర్ నేత మైసయ్య గౌడ్ విగ్రహాన్ని గ్రామంలో ఆవిష్కరించారు.
ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించలేదు...
ఆ తరువాత అమిత్ షా బూత్ కమిటీ సభలో పాల్గొన్నారు. ‘అన్ని స్థాయిల నేతలు ఒకే వేదిక మీద మీ ముందు ఉన్నాం' అని ప్రకటించగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ సందర్భంలో కేంద్ర పథకాలను రాష్ట్రం అమలు చేయడం లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తుంటే, తేరేట్పల్లిలో కనీసం ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించలేదని, దీని ద్వారా ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి తేటతెల్లం అవుతోందంటూ దుయ్యబట్టారు.
పేదలను కలవడానికే వచ్చా...
తెలంగాణ జిల్లాలో మూడు రోజులు పర్యటిస్తానని, సిద్ధాంతకర్త దీన్దయాల్ ఉపాధ్యాయ కార్యదీక్ష కార్యక్రమంలో భాగంగా తాను నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లా, హైదరాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు అమిత్ షా ప్రకటించారు. పేదలను కలవడానికే ఇక్కడి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు.
మోడీ నాయకత్వం ద్వారానే తెలంగాణ అభివృద్ధి...
నరేంద్రమోడీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా వికాస్ యాత్ర సాగుతోందని అమిత్ షా అన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి అంతా ఆలోచించాలని, మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం వల్లే అది సాధ్యమన్నారు.
13 రాష్ట్రాల్లో సొంతంగా...
ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ బిజెపి అని పేర్కొన్న అమిత్షా, ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో తమ పార్టీ సొంతంగా అధికారంలో కొనసాగుతోందని గుర్తు చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ విస్తారక్ కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని పటిష్టం చేయడమేగాక, బలోపేతం చేస్తున్నట్టు వివరించారు.
కార్యకర్తలదే ప్రచార బాధ్యత...
రైతులు, బడుగువర్గాలు, ఎస్సీ ఎస్టీలు, అట్టడుగు వర్గాల కోసం నరేంద్ర మోడీ రూపొందించిన కార్యక్రమాలను పల్లెపల్లెకు, ఇంటింటికీ ప్రచారం చేస్తూ విస్తారక్ యోజన ద్వారా మమేకం అవుతున్నారని వెల్లడించారు. దేశంలోని పేదలు, బలహీనవర్గాలు, దళితులు, మహిళలు, రైతులు, యువత కోసం మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు.
దళితులతో సహపంక్తి భోజనం...
ఆ తర్వాత తేరటుపల్లి దళిత కాలనీలో ఆయన సహపంక్తి భోజనం చేశారు. పలు రకాల శాకాహార వంటకాలను ఇష్టంగా ఆరగించి, పక్కనే కూర్చున్న దళితుడు బరిగెల రాములుతో కాసేపు మాట్లాడారు.
వేదికపైకి రాని కిషన్ రెడ్డి!
తెరటుపల్లిలో కార్యకర్తలతో అమిత్ షా సమావేశం సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్రెడ్డి వేదికపైకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్రెడ్డి వేదికపైకి రావాల్సిందిగా కిషన్ రెడ్డిని ఆహ్వానించినా ఆయన వెళ్లలేదు.