రోహిత్ పిరికివాడు కాదు, ఆత్మహత్యలో ప్రొఫెసర్ల హస్తం: ఏబీవీపీ ఎదురుదాడి
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఏబీవీపీ విద్యార్థులు గురువారం నాడు ఎదురుదాడికి దిగారు. రోహిత్ మృతిలో ప్రొఫెసర్ల హస్తం ఉందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప ఆరోపించారు.
రోహిత్ ఆత్మహత్య పైన తాము చింతిస్తున్నామని ఆయన చెప్పారు. ఆత్మహత్య నేపథ్యంలో రోహిత్ తోటి విద్యార్థులను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మృతిలో ప్రొఫెసర్ల హస్తం పైన ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రోహిత్ మృతి పైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హెచ్సియులో సంఘ విద్రోహశక్తులు తిరుగుతున్నాయని ఏబీవీపీ నేతలు విమర్శించారు. వేర్పాటువాదులతో కలిసి ఏఎస్ఏ తీవ్రవాద కార్యకలాపాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారన్నారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు
రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని సుశీల్ కుమార్ అన్నారు. ఆయన ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉందని చెప్పారు. ఆత్మహత్యకు ముందే రోహిత్ డిప్రెషన్లో ఉన్నారన్నారు. దత్తాత్రేయ లేఖకో, మరో లేఖకో ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు.
వందమంది దత్తాత్రేయలు వచ్చినా అతను భయపడే వ్యక్తి కాదన్నారు. అతని వెనుక ఏదో బలమైన కారణం ఉందని చెప్పారు. వేర్పాటువాదులంతా కలిసి విశ్వవిద్యాలయంలో తీవ్రవాద కార్యకలాపాలు, రాజకీయాలు చేస్తున్నారని ఏబీవీపీ ఆరోపించింది.
రోహిత్ ఆత్మహత్య పైన పారదర్శక విచారణ జరగాలని సుశీల్ కుమార్ డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్య తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. మూడు రోజుల పాటు తాను గది నుంచి బయటకు రాలేదన్నారు. తాను రోహిత్ లేఖను వందకు రెండొందల సార్లు చదివానని, ఎక్కడా ఎవరి పేరును అతను ప్రస్తావించలేదని చెప్పారు. ప్రతి ఒక్కరు క్యాంపస్లోకి వచ్చి రాజకీయాలు చేస్తున్నారన్నారు.