చంద్రబాబు గురించి ఏమో అనుకున్నా, అంతా వట్టిదే: హరీష్ ఆసక్తికర వ్యాఖ్య
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉన్న, అవగాహన కలిగిన నాయకుడు అనుకున్నానని, కానీ కృష్ణా జలాల పైన కేంద్రమంత్రి ఉమాభారతికి ఆయన లేఖ రాయడం చూస్తే అది తప్పని రుజువైందని తెలంగాణ మంత్రి హరీష్ రావు బుధవారం ఎద్దేవా చేశారు.
రంగారెడ్డి జిల్లాలో ఆయన చంద్రబాబు పైన దుమ్మెత్తి పోశారు. నీటి కేటాయింపుల విషయంలో చంద్రబాబు చెబుతున్న మాటల్లో అర్థం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు ఆపేందుకు చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాయడం సరికాదన్నారు. రైతులు, ప్రజలు తినే అన్నంలో మట్టికొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు.
అలాంటి కుట్రలు పన్నుతున్న చంద్రబాబు తెలంగాణ ద్రోహి అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల పైన ఏపీ సర్కారు ఇష్టారీతిన మాట్లాడుతోందన్నారు. సెక్షన్ 89 అమలు కాకుండా సెక్షన్ 87 ఉత్పన్నం కాదని చెప్పారు. తెలంగాణకు 389 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, బచావత్ అవార్డు అమలు తమకు అభ్యంతరం లేదన్నారు.
ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతారు: తలసాని
ఏ విషయంలోనూ తమ ప్రభుత్వం డబ్బుతో ముడిపెట్టడం లేదని, సమాజం కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. గొప్పగా బతకడమే బంగారు తెలంగాణ అన్నారు.
అందుకోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అరవై సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి గత రెండేళ్లలో చేసి చూపించామన్నారు. గతంలో రూ.200 ఫించన్ ఇస్తే తాము రూ.1000 ఇస్తున్నామన్నారు.
ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చేవని తెలిపారు. దొడ్డు బియ్యంలో పురుగులు రావడంతో పిల్లలు బడికి వెళ్లలేకపోయారన్నారు. ఈ విషయంపై మంత్రివర్గంలో చర్చ జరిగినప్పుడు సన్న బియ్యంతో భోజనం పెట్టాలని సీఎం నిర్ణయించారన్నారు.