ఇక్కడే ఉండిపోవాలనుంది: తిరుమలలో కేసీఆర్ మనమడు
తిరుమల కొండపైన స్వామివారి దర్శనం బాగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీ రామారావు తనయడు హిమాన్షు సంతోషం వ్యక్తం చేశాడు.
తిరుపతి: తిరుమల కొండపైన స్వామివారి దర్శనం బాగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీ రామారావు తనయడు హిమాన్షు సంతోషం వ్యక్తం చేశాడు. బుధవారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులతో శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.
కృష్ణదేవరాయలు, మహారాజుల తర్వాత కేసీఆరే: టీటీడీ ప్రశంసలు(పిక్చర్స్)
దర్శనం అనంతరం కేసీఆర్ తోపాటు వచ్చిన హిమాన్షు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ..'చిన్నప్పుడు ఎప్పుడో వచ్చానంట. అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు తాతయ్యతో కలిసి వచ్చాను. సంతోషంగా ఉంది. దేవుడిని చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలని ఉంది. ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది' అని చెప్పాడు. ప్రజలందరూ సుఖంగా ఉండాలని మొక్కుకున్నానని తెలిపాడు.
కాగా, కేసీఆర్ మాట్లాడుతూ.. 'రెండు తెలుగు రాష్ట్రాలను చల్లగా దీవించు తండ్రీ' అని వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని చెప్పారు. ఇరు ప్రాంతాలు త్వరగా అభివృద్ధి చెంది దేశంలోనే అగ్ర రాష్ట్రాలుగా అవతరించేలా దీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అన్ని సమస్యలూ త్వరలోనే పరిష్కారమవుతాయని చెప్పారు.