షాక్కి గురయ్యా, తప్పని నాకూ తెలుసు, అస్థిరత కలిగించకూడదనే: ఓటుకు నోటు కేసుపై పవన్ స్పందన
ఓటుకు నోటు అంశంపై తాను షాక్కి గురయ్యానని, అది తప్పని తనకూ తెలుసని, అయితే ఓ రాజకీయ పార్టీలో అస్థిరత సృష్టించగూడదన్న ఉద్దేశంతోనే తాను ఆ అంశంపై స్పందించలేదని జనసేన అధినేత పవన్కళ్యాణ్ చెప్పారు.
కరీంనగర్: ఓటుకు నోటు అంశం బయటికొచ్చినప్పుడు తాను షాక్కి గురయ్యానని, అది తప్పని తనకూ తెలుసని, అయితే ఓ రాజకీయ పార్టీలో అస్థిరత సృష్టించగూడదన్న ఉద్దేశంతోనే తాను ఆ అంశంపై స్పందించలేదని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
Recommended Video

సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ పత్రికా ప్రతినిధి.. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 'ఓటుకు నోటు'పై మీరెందుకు స్పందించలేదని పవన్ను ప్రశ్నించగా.. ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

అనంతపురంలో పార్టీ తొలి కార్యాలయం...
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జనసేన పార్టీ తొలి కార్యాలయాన్నిప్రారంభించనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంపై కూడా జనపార్టీ పూర్తిగా ఫోకస్ చేస్తుందని ఆయన చెప్పారు.

కరువు యాత్ర, కార్యకర్తలతో సమావేశాలు...
అనంతపురం జిల్లాలో కరువు యాత్ర చేపట్టనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని, అనంతరం ఒంగోలు ఫ్లోరోసిస్ బాధితులను పరామర్శిస్తానని, ఆ తరువాత పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మన్యం ప్రాంతాల్లో కూడా పర్యటిస్తానని చెప్పారు. మంగళ, బుధవారాలు కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.

రెండు రాష్ట్రాల్లో బరిలో జనసేన...
వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన పార్టీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ స్థాయిని, బలాన్ని బట్టి ఎన్ని చోట్ల పోటీ చేయాలనేది నిర్ణయించుకుంటామని వెల్లడించారు. 2019లో ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయనే దానిపై ఆలోచన లేదని అన్నారు. ఇతర పార్టీల్లో నుంచి వచ్చేవారు చెప్పే కారణాలు ఆమోదయోగ్యంగా ఉంటే సాదరంగా జనసేనలోకి ఆహ్వానిస్తామని పవన్ పేర్కొన్నారు.

అయిపోయింది, ఇక సినిమాలు చేయను...
‘అజ్ఞాతవాసి' తర్వాత పవన్ కల్యాణ్ సినిమా చేస్తారా? ఏ సినిమా చేస్తారు? ఎవరితో చేస్తారు? అసలు ఇంతకూ ఆయన సినిమాలు చేస్తారా చేయరా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేశారు పవన్ కల్యాణ్. కరీంనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతానికి ఇక సినిమాలు చేయనని, తనకు సినిమాలపై దృష్టి లేదని తేల్చేశారు జనసేనాని.

తెలంగాణ విషయానికొస్తే...
రాష్ట్ర ప్రభుత్వాలతో గొడవ పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని జనసేనాని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడి సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకుని, సునిశితంగా ఆలోచించి ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలనే దానిపై ఆలోచిస్తామని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ఆ తరువాత ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన చేయగలిగింది చేస్తున్నారని పవన్ అన్నారు.












Click it and Unblock the Notifications