ముఖ్యమంత్రి అవుతా.. ఆశీర్వదించండి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
సంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని ఈ సందర్బంగా జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. విజయదశమి రోజు తన మనసులోని మాట చెబుతున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని.. లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని ఆయన చెప్పారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో తాను అందుబాటులో లేకపోయినా.. తన భార్యతోపాటు అనుచరులు ఉంటారన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వాలిపోతారన్నారు. ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ తనపై ఉండాలని జగ్గారెడ్డి కోరారు. రానున్న కాలంలో తాను సీఎం అవుతానంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానంటూ ఇటీవల సీనియర్ నేత జానా రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పార్టీలో తానే సీనియర్ నేతనని.. తననే ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం ఉందని అన్నారు. మరోవైపు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైకి చెప్పకపోయినప్పటికీ.. ఇతర నేతలు మాత్రం ఆయనే సీఎం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పిన విషయం తెలిసిందే.
దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉండే సీఎం పదవి పోటీ మరోసారి తెరపైకి వచ్చిందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే, టికెట్ దక్కని నేతలు మాత్రం పార్టీని వీడి.. ఇతర పార్టీలకు వెళుతున్నారు. కొందరు స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణలో తమదే అధికారమంటున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చిపడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications