వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా, గవర్నర్ పదవిని తీసుకోను: దత్తాత్రేయ
వరంగల్: 2019 ఎన్నికల్లో మరోసారి ఎంపీగానే పోటీ చేస్తానని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. గవర్నర్ గా తాను పని చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ప్రజల మధ్యే తాను ఉంటానని బండారు దత్తాత్రేయ తేల్చి చెప్పారు.
వరంగల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదివారం నాడు బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు.
తెలంగాణకు 24గంటల విద్యుత్ ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని దత్తాత్రేయ అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రెండేళ్లలో మిషన్ భగీరథకు రూ.3,900కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 677 కోట్లు ఇచ్చిందని దత్తాత్రేయ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అత్యధిక సాయం చేసిందని . ప్రాజెక్టుల వేగవంతానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల సహయాన్ని అందించిన విషయాన్ని దత్తాత్రేయ గుర్తు చేశారు.
నాగం జనార్దన్ రెడ్డి పార్టీ నుంచి మారుతున్నారనే విషయంపై తాను మాట్లాడబోనని చెప్పారు. తాను గవర్నర్గా వెళ్లబోనని, ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేస్తూ 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని తెలిపారు.