అసెంబ్లీ రద్దు చేస్తా: ముందస్తు తేదీ ప్రకటించాలంటూ బీజేపీ, కాంగ్రెస్లకు కేసీఆర్ సవాల్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి తప్పకుండా వస్తామని చెప్పారు. శుక్రవారం రాత్రి మీడియాతో సుదీర్గంగా మాట్లాడారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తానంటూ కేసీఆర్ సవాల్
అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదన్నారు కేసీఆర్. బీజేపీ ముందస్తు ఎన్నికలకు వస్తే.. తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని అన్నారు. తేదీ ఖరారు చేస్తే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకెళ్తామని సవాల్ విసిరారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. జీఎస్టీని గతంలో బీజేపీ వ్యతిరేకిస్తే.. ఆ తర్వాత కాంగ్రెస్ వ్యతిరేకించిందని, ఇదంతా రాజకీయంలో భాగమేనని హార్వార్డ్లో చదువుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారని విమర్శించారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలవి బ్లేమ్ గేమ్ అని విమర్శించారు కేసీఆర్.
జాతీయ రాజకీయాల్లోకి రావడంపై కేసీఆర్ క్లారిటీ
కొత్త ఫ్రంట్ తో జాతీయ రాజకీయాల్లోకి వస్తామన్నారు కేసీఆర్. టీఆర్ఎస్ జాతీయ పార్టీ కాకూడదా? అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయినా ఇంకా దేశంలో నీటి యుద్ధాలెందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలను పడగొట్టడం కాకూండా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని బీజేపీకి హితవు పలికారు కేసీఆర్. తాను ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా చెబుతున్నానని తెలిపారు. దేశంలో ఉన్నత పదవి దొరికింది దేశానికి మంచి చేయాలని మోడీకి సూచించారు. కేసీఆర్ను ఏదోవిధంగా రాష్ట్రానికి పరిమితం చేయాలని మోడీ, బీజేపీ చూస్తోందన్నారు. తాను దుమ్మురేగేలా కొట్లాడతానని అన్నారు. కేసులు పెడితే ఏమైతది.. కోర్టులకు పోతామని అన్నారు. దేశ రాజకీయాల్లోకి వస్తామంటూ కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో భారీ వర్షాలపై కేసీఆర్ జాగ్రత్తలు
మరోవైపు, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రానున్న మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామని చెప్పారు. ఆర్టీసీకి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. వరదల్లో సాహసాలు చేయవద్దన్నారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. వర్షాలు, వరదలపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులందరినీ అప్రమత్తం చేశామని చెప్పారు. గొల్కొండలో చనిపోయిన ఇద్దరు శ్రీకాకుళంకు చెందిన కూలీలకు రూ. 3 లక్షల పరిహారం అందించామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. సచివాలయంలో 24గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, అవసరమైనవారు సంప్రదించాలని సూచించారు. నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు.