సారీ చెప్పి, చంద్రబాబుపై ఉద్యమిస్తా: రేవంత్ రెడ్డి, కెసిఆర్-ఆంధ్రా కాంట్రాక్టర్ల మధ్య..
హైదరాబాద్: తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావులు నిరూపిస్తే మేం తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన పోరాటం చేస్తామని, అలాగే, తాము తెలంగాణ ప్రజలకు క్షమాపణలు కూడా చెబుతామని టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు.
కృష్ణా నదిలో లభ్యమయ్యే నీటిలో తెలంగాణ వాటా 229 టిఎంసీలు, ఏపీకి వాటా 512 టీఎంసీలను సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర రావు కేంద్రానికి అధికారికంగా లేఖ రాశారని, పై లెక్కల ప్రాతిపదికగానే నీటిని పంచుకుంటామని అంగీకరిస్తూ రెండు రాష్ట్రాల సాగునీటి శాఖల ముఖ్య కార్యదర్శులు కేంద్ర మంత్రి ఉమాభారతి ముందు అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్ అన్నారు.
ఈ ఒప్పందాలు, లేఖలను దాచిపెట్టి వరంగల్ ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం హరీష్ రావు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 511 టీఎంసీల కేటాయింపు ఉందని, దాని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒప్పందాలను చంద్రబాబు ఉల్లంఘిస్తున్నట్లు నిరూపస్తే తాము క్షమాపణ చెప్పి, ఏపీపై ఉద్యమిస్తామని సవాల్ చేశారు.
ఎన్నికల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు హరీష్ రావు అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కృష్ణా జలాల వాటాపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఎవరి సమక్షంలో అయినా సిద్ధమే అన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు - కెసిఆర్, హరీష్ రావుల మధ్య సంబంధాలు బయటపెడతానన్నారు.