నిబద్ధతతో పని చేశా, ఎమ్మెల్సీ లెక్కే కాదు: రాష్ట్ర సాధన కృషి కెసిఆర్దేనన్న డీఎస్
హైదరాబాద్: తాను కాంగ్రెస్లో నిబద్ధతతో పని చేశానని పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెనకబడిన, బడుగు, బలహీన వర్గాలకు మేలు కోసమే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నానని స్పష్టం చేశారు.
‘నా జీవితంలో ఇది బాధకరమైన రోజు. 1969లో గాంధీభవన్లో అడుగుపెట్టాను. రెండు ఎన్నికల్లో 294 బి ఫారాలు ఇచ్చా. సోనియా నా పట్ల చూపించిన అభిమానం, విశ్వాసాన్ని మరువను. నన్ను ఏనాడు సోనియా తక్కువ చేసి చూడలేదు. ఆత్మగౌరవమే ముఖ్యం. తెలంగాణ సాధనకోసం చాలా ప్రయత్నం చేశా. పద్ధతిగా పార్టీ వీడుతున్నా. కాంట్రవర్సీ కామెంట్స్ చేయను. కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ వీడాల్సి వస్తోంది’ అని డిఎస్ తెలిపారు.
తన అంతరాత్మ మేరకే పార్టీ మారుతున్నానని, వేరే కారణాలు లేవని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఓ మోసకారని డిఎస్ ఆరోపించారు. పదవుల కోసం పార్టీ మారుతున్నాననడం సరికాదని అన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకో లెక్క కాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి తప్ప తాను అన్ని పదవుల్లోనూ పని చేశానని తెలిపారు. తాను ఏ పదవీ ఆశించి టిఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర సాధన కోసం చేయాల్సిన కృషి చేశానని తెలిపారు. పార్టీ ఎన్నో పదవులు ఇచ్చిందని.. తానూ అలాగే ప్రవర్తించానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలందరికీ తెలుసని, రాష్ట్ర సాధనలో ఎక్కువ కృషి ఖచ్చితంగా టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుదేనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కెసిఆర్ ఎంతో కమిట్మెంట్ తో పని చేస్తున్నారన్న ఆయన, బంగారు తెలంగాణ సాధన కోసమే టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పథాన సాగాలని ఆకాంక్షించారు. ఈ వయస్సులో తాను రాజకీయాలు చేయదలచుకోలేదని చెప్పారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందని, యువత ఎదురుచూస్తున్నారని డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు ఏపి ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు.
2014లో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అంశాన్ని హైకమాండ్ పెద్దలు సరిగా డీల్ చేయలేదన్నారు. తన సేవలను టీఆర్ఎస్ ఎలా వినియోగించుకుంటుందనేది సీఎం కేసీఆర్ చేతిలో ఉందన్నారు. బీసీల సంక్షేమానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని ప్రశంసించారు.