ఇక నేరుగా ప్రజలవద్దకే, కెటిఆర్ ప్లాన్ ఇదే!
హైదరాబాద్: తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ హైద్రాబాద్ ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు కొత్త ప్రణాళికతో ముందుకు రానున్నారు. ప్రజల వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకోవాలని మంత్రి కెటిఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు వచ్చే వారం నుండి హైద్రాబాద్ నగరంలో పలు చోట్ల సమావేశాలను నిర్వహించనున్నట్టు కెటిఆర్ ప్రకటించారు.
హైద్రాబాద్ నగరంలో ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు హైద్రాబాద్లో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అయితే జీఈఎస్ 2017 సదస్సు కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లను మరమ్మత్తు చేశారు. అదే సమయంలో హైద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో రోడ్లను బాగు చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది.
జీఈఎస్ 2017 సదస్సు సందర్భంగా ఇవాంకా ట్రంప్తో పాటు ఇతర ప్రతినిధులు తమ ప్రాంతాలకు వస్తే రోడ్లు బాగుపడతాయని కొందరు సెటైర్లు వేశారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడ సాగింది.
నేరుగా ప్రజలతో సమావేశాలు నిర్వహించనున్న కెటిఆర్
ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు వచ్చే వారం నుండి ప్రజలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నట్టు కెటిఆర్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నాడు ట్విట్టర్లో కెటిఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు.వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీవోలతో సమావేశాలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని కెటిఆర్ ప్రకటించారు.
టౌన్ హల్ సమావేశాలు
ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొనేందుకు వీలుగా మన నగరం పేరుతో టౌన్హల్ సమావేశాలను నిర్వహించనున్నట్టు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో వరుసగా టౌన్హాల్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
ఏడాదిన్నర క్రితమే ఈ ప్రయోగం
ఏడాదిన్నర క్రితమే ఈ తరహ ప్రయోగాన్ని కెటిఆర్ అమలు చేశారు.అదే సమయంలో ఏడాదిన్నర క్రితమే కెటిఆర్ హైటెక్స్ ప్రాంతంలో టౌన్హల్ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా కెటిఆర్ ఆ సమయంలో ఈ ప్రయోగాన్ని చేశారు. అయితే ఇదే తరహ ప్రయోగాన్ని నగరం మొత్తం చేయాలని ప్రస్తుతం భావిస్తున్నారు.
హమీల అమలుకు
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయడంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకుగాను కెటిఆర్ ఈ సమావేశాలను ఏర్పాటు చేయాలని భావించారు. స్థానికంగా ఉన్న సమస్యలను కొన్నింటని అప్పటికిప్పుడు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొనే వెసులుబాటు కూడ లభిస్తోంది. దీంతో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవలంభించాల్సిన చర్యలపై ప్లాన్ చేయనున్నారు.