కేసీఆర్! 'గాలి'లా జైలుకు పంపిస్తా: నాగం, చేతులెత్తి మొక్కిన ఉత్తమ్
మహబూబ్ నగర్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని పంపించినట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కూడా తాను జైలుకు పంపిస్తానని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి గురువారం నాడు హెచ్చరించారు.
తెలంగాణలో చేపట్టనున్న నీటిపారుదల ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతుంటే తన పైన టిఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ సొంత పత్రిక, చానళ్లలో ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నానని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరిస్తూ ప్రకటనలు చేస్తున్నారని, ఇలాంటి వాటికి తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. తనపై భౌతిక దాడులు చేస్తామన్న విషయాన్ని కేంద్రహోంమంత్రి, గవర్నర్, డీజీపీల దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.
మహబూబ్ నగర్ అభివృద్ధికి ఎవరు ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ చేశారు. తెరాస పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తాను బయటపెడతానని చెప్పారు. త్వరలో మిషన్ కాకతీయలో జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేస్తానని చెప్పారు.
కాగా, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ తెరాస కార్యకర్తలు గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

టి కాంగ్రెస్ ప్రశ్న
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నిర్వాసితులవుతున్న వారికి మెరుగైన పరిహారం ఇవ్వాలని అడగడంలో తప్పేముందని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. చేతులెత్తి మొక్కుతున్నా, రైతుల పొట్ట కొట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులపై వాస్తవాలు, గణాంకాలతో తాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమవుతున్నామన్నారు. కేసీఆర్కు ఆంధ్రా కాంట్రాక్టర్లంటే ముద్దని, తెలంగాణ రైతులు మాత్రం వద్దని దుయ్యబట్టారు.
కోటి ఎకరాలకు నీరిస్తామన్న కేసీఆర్ కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన అనేక సాగునీటి ప్రాజెక్టులు 70-80 శాతం పూర్తయి చివరి దశలో ఉన్నా వాటిని ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.












Click it and Unblock the Notifications