సీఎంను కాను..ముఖ్యమంత్రిని చేస్తా : నా పై రెక్కీ జరిగింది- బండి సంజయ్ సంచలనం..!!
తనకు తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం లేదని..తాను కాబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. అదే సమయంలో తాను ఎంపీగా గెలవటానికి దోహదపడిన అంశాలు.. పార్టీ అధినాయకత్వం ఆలోచనలను బండి సంజయ్ పంచుకున్నారు. తాజాగా, ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన సీఎం కేసీఆర్ వ్యూహాలు..తమ వైఖరిపైన స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయమంటూ మరోసారి చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలు తప్పయితే అధినాయకత్వం తనను మందలించేదని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నారంటూ వెల్లడించారు.

కేసీఆర్ ఉద్యమం తేవాలనే ప్రయత్నం
కేసీఆరే రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఒక రైతు నాయకుడిని తయారు చేసి దేశ వ్యాప్తంగా ఉద్యమం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని సంజయ్ చెప్పారు. ఆయనకు ఎవరూ సహకరించటం లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇన్ని రోజులు ఆడింది ఆట పాడింది పాట మాదిరిగా ఉండేదని చెప్పుకొచ్చారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా అయిన తరువాత తన ఖాతాలను విచారించారని చెప్పారు.
తన భార్య ఎస్బీఐ అధికారిగా పని చేస్తున్నారన్నారు ఓ ఇంటెలిజెన్స్ అధికారి వెళ్లి బండి సంజయ్ అకౌంట్ నంబరు కావాలని అడిగారన్నారు. తాను తాజాగా జైలుకు వెళ్లటం ఎనిమిదో సారని వివరించారు. మంత్రి పదవి కోసం 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీ యువమోర్చాలో ఉన్న సమయంలో నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. అవి అలవాటు కావటంతో పెద్ద లెక్కలోకి తీసుకోలేదన్నారు.

ఆ వ్యాఖ్యల వ్యతిరేకత పని చేసింది
తాను చిన్నప్పుడు పాఠశాలలో ఉన్న సమయంలోనే ఏబీవీపీలో అంచెలంచెలుగా ఎదిగానని..తరువాత యువమోర్చాలో పని చేసానని చెప్పారు. అద్వానీ రధ యాత్ర సమయంలో తనకు వెంకయ్యనాయుడు అవకాశం ఇచ్చారన్నారు. 35 రోజులు అద్వానీతో కలిసి పని చేసానని గుర్తు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ వస్తుందని ఊహించలేదని.. డబ్బేమీ పెట్టలేదని చెప్పారు.
జిల్లాలో ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అందులో కేటీఆర్, ఈటల, గంగుల వంటి హేమాహేమీలు ఉన్నా పార్టీ కేడర్ మద్దతుతోనే గెలిచానని చెప్పుకొచ్చారు. కేసీఆర్.. ‘హిందుగాండ్లు.. బొందుగాండ్లు' అనే వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యతిరేకత పనిచేసిందని చెప్పారు. మజ్లిస్ పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి ఉంటున్నారు. మరి.. ఓల్డ్ సిటీలో అభివృద్ధి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.

ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు పోటీ
దీనిపై భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద మాట్లాడినప్పుడు ముస్లిం మేధావి వర్గంలో ఓ వాతావరణం వచ్చిందని వివరించారు. తనను కరీంనగర్లో మూడుసార్లు చంపే ప్రయత్నం చేశారంటూ చెప్పుకొచ్చారు. టీమ్స్ వచ్చి తన పై రెక్కీ నిర్వహించాయని పేర్కొన్నారు.
ఒక వ్యక్తి లెదర్ బ్యాగులు అమ్ముతున్నట్లు తన ఇంటి ముందు నెల రోజలు తిరిగాడని చెప్పారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్తే తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో మా పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు రెడీగా ఉన్నారని బండి చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డితో సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.
Recommended Video

సీఎం కాను..సీఎంను చేస్తా
తమ మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందని ఎదురు ప్రశ్నించారు. తాను సీఎంను కానని బండి చాలా స్పష్టంగా చెప్పారు. తన దృష్టిలో సీఎంను చేసినోడే గొప్పోడని చెప్పుకొచ్చారు. తాను సీఎంను పక్కా చేస్తానంటూ తేల్చి చెప్పారు. కమలం - గులాబీ పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందాలు లేవన్నారు.
భవిష్యత్ లోనూ టీఆర్ఎస్ తో కలిసే అవకాశం లేదని స్పష్టం చేసారు. కేసీఆర్ ను ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు తెచ్చామని...అక్కడ నుంచి ప్రగతి భవన్.. అటు నుంచి ధర్నా చౌక్... ఇక, రాష్ట్రంలో తిరిగేలా చేసామని.. తనను తక్కువ అంచనా వేసిన వారికి తానేంటో.. బీజేపీ ఏంటో చూపించామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications