దేవరయాంజల్ లో రేవంత్ పర్యటన.!ఐఏఎస్ కమిటీ కేసీఆర్ బంధువుల ఆక్రమణలపై నిగ్గు తేల్చాలన్న ఎంపీ.!
హైదరాబాద్ : దేవరయాంజల్లో సీతారామ స్వామి ఆలయ మాన్యాలను ఆక్రమించిన మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, మల్లారెడ్డి భవనాలు, ఫామ్ హౌస్లు నిర్మిస్తే, ఇవే అక్రమ భవనాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ కమిటీ బృందానికి ఎందుకు కన్పించడం లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి దేవుడి భూములను పరిరక్షించాలనే చిత్తశుద్ది ఉంటే భూ ఆక్రమణలపై సిబిఐ చేత సమగ్ర విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిజ నిర్థారణ కమిటీ ఆలయ భూ ఆక్రమణలను పరిశీలించారు. సీఎం చంద్రశేఖర్ రావు దగ్గరి బంధువు రఘునందన్రావు అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ నియమించినప్పుడే సీఎం చిత్తశుద్ది ఏమిటో తెలిసిపోయిందన్నారు రేవంత్ రెడ్డి.

దేవరయాంజల్ సీతారామ స్వామి భూఆక్రమణలపై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్.. నిజనిర్దారణ కమిటీతో పర్యటన..
గ్రేటర్ హైదరబాద్ చుట్టు, హెచ్ఎండిఏ పరిధిలో వేలాది అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ శాఖ మంత్రి, హెచ్ఎండిఎ, మున్సిపల్ కమిషనర్లు, రేరా ఛైర్మన్ సోమేష్ కుమార్ బాధ్యత వహించాలన్నారు. దేవుడి మాన్యాలను ఆక్రమించిన మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు రేవంత్. దేవర యాంజల్ గ్రామ పరిధిలోనే 160పైగా అక్రమ నిర్మాణాలు కమిటీ దృష్టికి వచ్చాయని పత్రికల్లో కథనాలు వచ్చాయని, ఒకే గ్రామంలో ఇన్ని అక్రమాలు ఉంటే, గ్రేటర్ చుట్టూ వేలాది అక్రమ నిర్మాణాలు బయట పడే అవకాశం ఉందన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే దేవరయాంజల్ భూ ఆక్రమణలపై ప్రభుత్వం కమిటీ వేసిందనా ఘాటు విమర్శలు చేసారు రేవంత్ రెడ్డి.

గ్రేటర్ చుట్టు రియల్ ఎస్టేట్ మాఫియా.. అంతా కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తోందన్న ఎంపీ..
ప్రస్తుతం సీతారామ స్వామి ఆలయానికి సంబంధించిన 1531 ఎకరాల భూమి 1925 నుంచి ఎవరి చేతుల్లోకి మారిందనే విషయాన్ని బయట పెట్టాలన్నారు. కేవలం ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన అక్రమ నిర్మాణాలపై కమిటీ దృష్టి పెట్టిందన్నారు. అదే దేవాలయానికి సంబంధించిన భూముల్లో సీఎం చంద్రశేఖర్ రావు దగ్గరి బంధువులకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయని, చంద్రశేఖర్ రావు వాటాదారుడిగా ఉన్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు సర్వే నెం. 437లో ఉన్నాయన్నారు రేవంత్. అవి అక్కడి నుంచే ప్రచురణ అవుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి.

దేవరయాంజల్ మాన్యాలను ఆక్రమించిన మంత్రులు.. కేటీఆర్, మల్లారెడ్డి క్యాబినెట్ నుంచి తొలగించాలన్న రేవంత్
ఆర్మీ నిబంధనలు ఉల్లంఘించి 45 ఫీట్ల ఎత్తు వరకు నమస్తే తెలంగాణ భవన కార్యాలయం నిర్మించారు. ఇదే గ్రామపరిధిలోని సర్వే నెం. 212 నుంచి 218 సర్వే నెంబర్లలోని 84 ఎకరాల భూమిని చంద్రశేఖర్ రావు దగ్గరి బంధువు గండ్ర శ్రీనివాస్ అక్రమించారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. గండ్ర శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం శ్రీని డెవలపర్స్ పేరిట 84 ఎకరాల్లో వెంచర్ వేసి విక్రయించారని, ఈ భూములు 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్నభూములను రిజిస్ట్రేషన్ చేసిన శామీర్ పేట సబ్ రిజిస్టార్పై కేసు నమోదు చేయాలన్నారు. 657 సర్వే నెం. లోని భూమిని అక్రమించి మంత్రి మల్లా రెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ నిర్మించారన్నారు రేవంత్ రెడ్డి.
Recommended Video
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్, హెచ్ఎండిఎ కమిషనర్, రేరా ఛైర్మన్ స్పందించాలి.. డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి..
శ్రీనివాస్ రెడ్డి భార్య లక్ష్మీ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీకి ఛైర్మన్గా ఉన్నారన్నారు. గతంలో జీవో111 పరిధిలో చంద్రశేఖర్ రావు కుమారుడు అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని బయట పెడితే సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ నాయకత్వంలో గ్రేటర్ చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా తయారైయ్యిందని సంచలన ఆరోపణలు చేసారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కరోనా కాలంలో మంత్రి కేటీఆర్ ఆయన మిత్రులతో కలిసి జీవో 111 పరిధిలోని రైతులను బెదిరించి వందలాది ఎకరాల వ్యవసాయ భూములను రాత్రి రాత్రికే చదును చేస్తున్నారని ఆరోపించారు. భూ ఆక్రమణలపై కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చూడుతామన్నారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications