ప్రభుత్వ స్కూళ్లలోనే వారి పిల్లలూ: కెసిఆర్
హైదరాబాద్: ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే విధంగా విద్యా వ్యవస్థను తయారు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అధికారులకు మార్గదర్శనం చేశారు. అంతరాలు లేకుండా అందరూ ఒకే చోట విద్యనభ్యసించాలని ఆయన అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచం గర్వపడే విధంగా తెలంగాణ విద్యా విధానం ఉండాలని ఆయన అన్నారు.
కెజి టు పిజి ఉచిత విద్యపై సలహాలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలు అదే విధంగా ఉంటాయని, మూడో తరగతి వరకు పిల్లలు స్థానిక పాఠశాలల్లోనే చదవాలని ఆయన అన్నారు. తెలుగుకు ప్రాధాన్యం తగ్గించుకుండానే ఇంగ్లీష్ బోధన జరగాలని ఆయన సూచించారు. పాఠశాలలకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం టీ-ప్రైడ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని వివరించారు. ఇంజినీరింగ్ చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు శిక్షణనిచ్చి పెట్టుబడి సమకూర్చి ప్రోత్సహించాలని సూచించారు.

కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే అనుభవం ఉందని వారిని గుర్తించి కాంట్రాక్టర్లుగా అభివృద్ధి చేయాలని, కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్లాట్లు రిజర్వ్ చేయాలని ఆదేశించారు.
గతంలో దళితుల అభివృద్ధి విషయంలో ప్రచారం జరిగిందే తప్ప గుణాత్మక మార్పులేమీ లేవని ఆయన అన్నారు. దళితుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దళితుల కుటుంబాల నుంచి దారిద్య్రాన్ని పారదోలడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వాళ్లు మళ్లీ దరిద్రులుగా మారకుండా పలు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
దళితులకు ఉచితంగా భూమి ఇవ్వడమే కాకుండా వ్యవసాయం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రూరల్, అర్బన్, అర్బన్ దళితులు, ఎస్టీలకు ఇంకా ఏం చేయవచ్చో అధ్యయనం చేసి ప్రభుత్వానికి అధికారులు పలు సూచనలు చేయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్లో యావస్ అనే ప్రొఫెసర్ చిన్న వర్తకుల జీవన ప్రగతికి చేసిన ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల విప్లవానికి దారి తీసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
అదే విధంగా కొత్త ఆలోచనలతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. కలెక్టర్లు ఇతర ప్రభుత్వాధికారులు దళిత బస్తీలు, గిరిజన తండాల్లో కొంత సమయం గడిపితే వాళ్ల వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని చెప్పారు.
సంక్షేమ హాస్టళ్లలో అవినీతిని సహించబోమని కెసిఆర్ అన్నారు. పోటీ పరీక్షల కోసం స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వక్ఫ్ భూములు మైనారిటీల సంక్షేమానికి ఉపయోగపడాలని ఆయన అన్నారు. జీవో 58 కింద వక్ఫ్ భూములను క్రమబద్దీకరించడానికి వీలు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications