హెచ్ఎండీఏ జేసీగా ఆమ్రపాలి బాధ్యతలు: ప్రభుత్వ ఆలోచన అదేనా?
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి కాటా (Amrapali kata) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బీ ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతోపాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని తెలిపారు. ఆ తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంఛార్జీ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. అధికారులతో చర్చించారు.

కాగా, హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన హెచ్ఎండీఏపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏకు ఉన్నత పరిపాలన అధికారిగా కమిషన్ మాత్రమే ఉండగా.. తాజాగా, జాయింట్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ప్రభుత్వం నియమించడం గమనార్హం. 2019 నుంచి హెచ్ఎండీఏకు కమిషనర్గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కొనసాగుతున్నారు. వేలం ద్వారా రూ. వందల కోట్ల విలువైన భూముల అమ్మకాలు, ఔటర్ రింగ్ రోడ్ లీజు ఇతర ప్రాజెక్టులు ఆయన హయంలోనే జరిగాయి.
హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ టౌన్ షిప్ లు, శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మాణం ఇతరత్రా ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించింది. దీంతో మహా నగరాభివృద్ధిలో ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన హెచ్ఎండీఏ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి కమిషనర్ను పోస్టులో కొనసాగిస్తూనే.. కొత్తగా జాయింట్ కమిషనర్ పోస్టులో అదనంగా మరో ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని నియమించినట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర హెచ్ఎండీఏలో కీలకం కానుందని తెలుస్తోంది. అయితే, అరవింద్ కుమార్ ను కమిషనర్ గా కొనసాగిస్తారా? లేక కొత్త కమిషనర్ను నియమిస్తారా? వేచి చూడాలి.












Click it and Unblock the Notifications