హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి: మంత్రి శ్రీధర్ బాబు సతీమణికి కీలక బాధ్యతలు, ఐఏఎస్ల బదిలీలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది. మరికొందరిని కొత్తగా నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా నియమించింది.
అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి నియామకం ఆసక్తికరంగా మారింది. అంతేగాక, మూసీ అభివృద్ధి సంస్థ ఇంఛార్జీ ఎండీగా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు, విద్యుత్ శాఖలో మాత్రం భారీ మార్పులు చేపట్టింది.
ట్రాన్స్కో, జెన్కో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా రిజ్వీని నియమించింది. ఈయన ఇప్పటికే ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు. ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా నియామకయ్యారు. ఇక, టీఎస్ఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ అలీ, టీఎస్ఎన్పీడీసీఎల్ (వరంగల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి నియమితులయ్యారు. డిప్యూటీ సీఎం ఓఎస్డీగా ఐఏఎస్ అధికారి కృష్ణప్రసాద్, అగ్రికల్చర్ డైరెక్టర్గా గోపీ నియమితులయ్యారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణికి కీలక బాధ్యతలు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం శైలజా రామయ్యర్ యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆమ్రపాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటా రెండు రోజుల క్రితం కలిశారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమ్రపాలి డిప్యూటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారామె. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడే డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు.
అక్కడ డిప్యూటేషన్ పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ మేరకు ఇక్కడ రిపోర్టు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు.












Click it and Unblock the Notifications