ఐఎఎస్ భార్య కారు డ్రైవర్ హత్య: వెనక ఓ మహిళ, అశ్లీల వీడియోలే కారణమా....
ఐఎఎస్ అధికారి భార్య డ్రైవర్ను ఆమె కుమారుడే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య వెనక ఓ మహిళ ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్: అశ్లీల వీడియోలకు సంబంధించిన తగాదానే ఐఎఎస్ అధికారి భార్య కారు డ్రైవర్ హత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలో ఐఎఎస్ అధికారి కుమారుడి ప్రమేయం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆశ్లీల దృశ్యాలకు సంబంధించిన వీడియోలపై ఇరువురి మధ్య తగాదా చోటు చేసుకున్నట్లు, దాని కారణంగానే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఐఎఎస్ అధికారి డి. వెంకటేశ్వరరావుతో పాటు అతని కుమారుడు డి. వెంకట్ సుక్రును కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా దుబ్బతండాకు చెందిన భూక్యా నాగరాజు అలియాస్ నాగు (28) భార్య జమున, ఇద్దరు పిల్లలతో కలసి హైదరాబాద్ చేరాడు. రహమతనగర్లోని జవహర్నగర్లో నివాసం ఉంటున్నాడు. వ్యవసాయ శాఖలో జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు భార్య దగ్గర కారు డ్రైవర్గా కుదిరాడు.

ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర రావు కుమారుడు సుశ్రుత వెంకట్ (24)తో నాగరాజుకు స్నేహం కుదిరింది. తరుచుగా ఇద్దరు కలిసి మద్యం సేవించేవారు. ఈనెల 17వ తేదీ రాత్రి నాగరాజు, వెంకట్ యూసుఫ్గుడా సాయి కల్యాణ్ అపార్ట్మెంట్ పైకి వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమై అది ముదిరింది.
అగ్రహాన్ని అదుపు చేసుకోలేని స్థితిలో వెంకట్ డ్రైవర్ నాగరాజు తలను నేలకేసి కొట్టాడు. బలమైన దెబ్బలు తగలడంతో నాగరాజు మరణించాడు. అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంకట్ ఈనెల 18వ తేదీ రాత్రి మరో యువకుడితో కలసి నాగరాజు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు.
వీలు కాకపోవడంతో 19వ తేదీ (ఆదివారం) సాయంత్రం మళ్లీ వచ్చి మృతదేహాన్ని మూటగా కట్టి కిందకు దించేందుకు ప్రయత్నించాడు. మెట్ల వద్దకు రాగానే అలికిడి విన్న అపార్ట్మెంట్లోని రిటైర్డ్ ఉద్యోగి సాంబశివరావు అతడిని ప్రశ్నించాడు.దీంతో కూడా వచ్చిన యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు.
భరించలేని దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మూటలో యువకుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. 17వ తేదీ రాత్రి అపార్టుమెంట్పైకి ఇద్దరు యువకులు వెళ్లారని, వారిలో ఒకరే తిరిగి వచ్చారని గుర్తించారు.
దాని ఆధారంగా మృతదేహం నాగరాజుదని, తిరిగి వచ్చిన యువకుడు వెంకట్ అని నిర్ధారించారు. ఇక, ఈ కేసు నుంచి తప్పించేందుకు ఐఏఎస్ అధికారి విఫలయత్నం చేశారు. మూడు రోజులుగా కారు డ్రైవర్ కనిపించట్లేదని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అప్పటికే తమ వద్దనున్న సీసీ కెమెరా ఫుటేజ్లను పోలీసులు ఆయనకు చూపించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను చెప్పారు.
నాగరాజు సెల్ఫోన్ మాయం
నాగరాజు, వెంకట్ మధ్య వివాదానికి సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియోలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకట్ ఓ యువతితో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను నాగరాజు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడని, వాటితో వెంకట్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశాడని తెలిసింది.
ఈ వివాదమే హత్యకు దారి తీసి ఉండవచ్చనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. హత్యానంతరం నాగరాజు సెల్ఫోన్ను వెంకట్ చెత్తకుండీలో పారేసినట్లు సమాచారం. అది ఓ మహిళకు దొరికినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఆ మొబైల్ను స్విచ్ఛాఫ్ చేసినట్లు సమాచారం. ఆ సెల్ఫోన్ లభిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
నాగరాజు భార్య ధర్నా....
మృతుడి భార్య జమున, కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి వెంకట్ తమ ఇంటికి వచ్చి భర్తను తీసుకెళ్లినట్లు ఆమె తెలిపింది.
ఓ మహిళ ప్రమేయంతోనే ఈ హత్య జరిగినట్లు జమున ఆరోపించింది. దర్యాప్తులో లభించిన సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేశామని, నిందితులు ఎంతటివారైనా కఠినంగా వ్యవహరిస్తామని వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వర్రావు హామీనివ్వటంతో ఆందోళన విరమించారు.












Click it and Unblock the Notifications