చిరంజీవి వస్తానంటే.. ఆనందంగా స్వాగతిస్తాం: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రముఖ నటుడు చిరంజీవి వంటి ప్రజల్లో గుర్తింపున్న వ్యక్తులకు తమ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చిరంజీవి పేరున్న నటుడని, అతనికున్న ఇమేజ్ పార్టీకి సహకరిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన బిజెపిలోకి వస్తానంటే, ఆనందంగా స్వాగతం పలుకుతామని వివరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చిరంజీవి ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
పార్టీ కార్యకలాపాల్లో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తనను పక్కన పెడుతున్నారని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఇటీవల చిరంజీవి రాహుల్ గాంధీని కలవగా, 150వ సినిమాపై దృష్టి పెట్టకుండా, పార్టీ తిరిగి పుంజుకునే చర్యలు చేపట్టాలని రాహుల్ క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే, ఇకపై ఆ పార్టీలో కొనసాగరాదని చిరంజీవి భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడితే, బిజెపిలో చేరుతారా? లేక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా? అనేది వేచి చూడాలి.