కేసీఆర్ అధికారంలో ఉంటే ఇళ్లురావు, ఉద్యోగాలు రావు.!ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఘాటు విమర్శలు.!
నాగార్జున సాగర్/హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారంలో ఉన్నంత కాలం గ్రామాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు యువతకు ఉద్యోగాలు రావని భునవగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అందుకే చంద్రశేఖర్ రావు చెంప ఛెల్లుమనే విధంగా సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డిని గెలిపించి గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు. నేడు సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గుర్రంపోడు మండలం వెంకటాపురం, బుడ్డారెడ్డి గూడెం, కోనాయిగూడెం, బ్రాహ్మణగూడెంలో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చంద్రశేఖర్ రావు విధానాలను దుయ్యబట్టారు.
తన ఇంట్లో నాలుగు ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలోని యువతను మర్చిపోయారన్న కోమటిరెడ్డి..
తాను ఉండేందుకు వందల కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న చంద్రశేఖర్ రావుకు పేదోడు తల దాచుకోవడానికి ఇళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇంట్లో నలుగురికి పదవులు ఇచ్చి, యువతకు మొండి చెయ్యి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మాటలతో మోసం చేస్తున్న చంద్రశేఖర్ రావుకు, టీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగేలా సాగర్లో ఓడించి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నిడని గుర్తు చేశారు. రాష్ట్రంలోని యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడితే కనీసం వారికి భరోసా ఇచ్చేందుకు సైతం చంద్రశేఖర్ రావు ముందుకు రావట్లేదని మండిపడ్డారు.
సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి బుద్ది చెప్పాలి.. ఎన్నికల కోసం ప్రజలను చీల్చుతున్నారన్న ఎంపీ..
కరోనా వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ టీచర్లను పట్టించుకోకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులను భరించలేక హాలియాలో రవి కుమార్ అనే ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అసలు చంద్రశేఖర్ రావుకు మానవత్వం అనేదే లేదన్నారు. రవి కుమార్ పిల్లలు అనాథలుగా మారితే వారిని జానారెడ్డి కొడుకు దత్తత తీసుకుని వారి యోగాక్షేమాలు చూస్తున్నారని వివరించారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రశేఖర్ రావు తన కుటుంబం, తన పిల్లలను తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోవట్లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్న చంద్రశేఖర్ రావు ఆ డబ్బును సాగర్ లో పంచి గెలవాలని చూస్తున్నాని తెలిపారు. డబ్బుల సంచులను ఇచ్చి మండలానికి ఒక ఎమ్మెల్యేను పంపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని వివరించారు.
కేసీఆర్ స్వార్ధం కోసం అప్పుల రాష్ట్రంగా మార్చారు.. ఘాటుగా విమర్శించిన భువనగిరి ఎంపి..
నల్గొండ జిల్లాపైయ కేసీఆర్ సవతి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేటకు వందల కోట్లు ఇస్తున్న కేసీఆర్ నల్గొండ జిల్లా కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో చేపట్టి 70శాతం పనులు పూర్తిచేసుకున్న శ్రీశైలం సొరంగం పనులకు నిధులు ఎందుకు విడుదల చేయట్లేదో ప్రజలకు చెప్పాలన్నారు. వెయ్యి కోట్లు ఖర్చుపెడితే నల్గొండ జిల్లాలో రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు వచ్చే అవకాశం ఉన్న పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పడు తెలంగాణ మిగులు బడ్జెట్గా ఉంటే ఏడేళ్లలో 4 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చరాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1300 మంది యువత చనిపోతే చలించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో మళ్లీ యువత ఆత్మహత్యలకు పాల్పడడం చాలా బాధ కలిగిస్తుందని కోమటి రెడ్డి తెలిపారు.
ప్రజెక్టుల పేరుతో పచ్చి మోసం.. ప్రజలు గ్రహించాలన్న కోమటి రెడ్డి..
ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోచుకున్న చంద్రశేఖర్ రావు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు మాత్రం నిధులు కేటాయించట్లేదన్నారు. నాగార్జున సాగర్ అభివృద్ది జరగిందంటే అది జానారెడ్డి హయంలోనే అని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించినా, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఆ ఘనత జానారెడ్డిదేనని వివరించారు. నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ సర్కార్ కులాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తుందని దానిని ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని కోరారు. జానారెడ్డి గెలిస్తే టీఆర్ఎస్ సర్కార్ మరో రెండేళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేస్తుందని.. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జానారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.