స్టూడెంట్స్, పేరెంట్స్కు భరోసా ఏదీ : ఎల్లుండి తెలంగాణ బంద్కు దత్తాత్రేయ పిలుపు
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల వెనుక భారీ స్కాం జరిగిందని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. రిజల్ట్స్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భరోసా ఏదీ ?
ఇంత జరిగినా .. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం నింపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులు పిట్టల్లా రాలుతోన్న పాలకవర్గాలు చేష్టలుడిగా చూస్తుందని మండిపడ్డారు. ఇంటర్ అవకతవకలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ మే 2న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు.
నిరసన చేపడితే అరెస్ట్ ?
టీఆర్ఎస్ సర్కార్ నియంత పాలనను తలపిస్తోందన్నారు దత్తాత్రేయ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా నిరసన తెలిపే హక్కు నేతలకు ఉంటుందని .. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేయడం దేనిక సంకేతమని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. లక్ష్మణ్ దీక్ష భగ్నం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ట్యాంక్ బండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
కేంద్రానికి రిపోర్ట్
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు దత్తాత్రేయ. కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించి .. తగు చర్యలు తీసుకోవాలని కోరుతామని చెప్పారు. ఇంటర్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపంచాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని అల్టిమేటం జారీచేశారు.