తీరం దాటిన వాయుగుండం, కుండపోత - ఈ ప్రాంతాలకు తీవ్ర హెచ్చరిక..!!
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వానలతో రెండు రాష్ట్రాల్లోని పలు వాగులు పొంగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాలు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుండపోత వర్షాల తో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు కుండపోత వర్షాల పైన వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24గంటల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. 19జిల్లాలకు ఆరెంజ్, మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది.

వానలు దంచికొడుతుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 18.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఫలితంగా ఈ నెలాఖరు వరకు వర్షాలు కొనసాగుతాయని భావిస్తోంది. ఇక, హైదరాబాద్ తో సహా జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అయింది.












Click it and Unblock the Notifications