ముంచుకొస్తున్న ముప్పు..ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్..!!
మొంథా తుఫాను వణికిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తుఫాను ప్రభావం ప్రారంభమైంది. రేపు (మంగళవారం) రాత్రికి తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటి కే పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. తీరం దాటే సమయంలో ప్రచండ గాలులతో పాటు గా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్స్ జారీ అయ్యాయి. దీంతో.. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. రానున్న రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
మొంథా తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది. కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్లు, విశాఖకు ఆగ్నేయంగా 710 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైం ఉంది. మంగళవారం తీవ్ర తుఫానుగా మారి సాయంత్రం కాకినాడ దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ సమయంలో గరిష్టంగా గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో 5 సెంటీమీటర్ల నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ రోజు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రేపు (మంగళవారం) తుఫాను ప్రభావంతో జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో అక్కడకక్కడా, హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని వెల్లడించింది. అటు కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. రేపటి నుంచి వరుసగా మూడు రోజులు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విశాఖ కేంద్రంగా నడిచే పలు రైళ్లను రద్దు చేసారు. ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశం ఉందని అలర్ట్స్ జారీ అవుతున్నాయి. దీంతో, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications