హాజీపూర్లో వెలుగు చూస్తున్న మానవ మృగం శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలు.. మరో బాలిక కల్పన కూడా...
ఇప్పుడు హాజీపూర్ గ్రామంలో ఎక్కడ పాడుబడిన బావులను చూసినా ఒక్కటే అనుమానం అంతే భయం కలుగుతుంది. అందుకు కారణం లేకపోలేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అభం శుభం తెలియని బాలికలు ఒక ఉన్మాది ఘాతుకాలకు బలైపోయారు. అత్యాచారం చేసి హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చి ఊర్లోనే అందరి మధ్య తిరుగుతున్న ఓ మానవ మృగం చేసిన ఘాతుకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.

నాలుగేళ్ళక్రితం మిస్ అయిన కల్పనను చంపి మరోబావిలో పాతిపెట్టిన శ్రీనివాసరెడ్డి
నాలుగు సంవత్సరాల క్రితం బొమ్మలరామారం సమీపంలోని మైసిరెడ్డిపల్లిలో అదృశ్యమై, ఇంతవరకూ ఆచూకీ లేకుండా పోయిన కల్పన అనే అమ్మాయిని కూడా సైకో శ్రీనివాస్ రెడ్డే శ్రావణి తరహాలోనే రేప్ చేసి హత్య చేశాడని రాచకొండ పోలీసు వర్గాలు తేల్చాయి. హాజీపూర్ మానవ మృగం చేతిలో నాలుగేళ్ల క్రితం చిదిమివేయబడ్డ చిన్నారి కల్పన మృతదేహం అవశేషాలను పోలీసులు వెలికితీశారు. ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు దొరికిన బావికి దగ్గర్లో ఉన్న మరో బావిలో కల్పనను పూడ్చి పెట్టానని ఉన్మాది మర్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో, పోలీసులు బావిలో తవ్వకాలు చేపట్టారు.

మరో పాడుబడిన బావిలో కల్పన మృతదేహం తాలూకు అవశేషాలను వెలికి తీసిన పోలీసులు
హత్య జరిగి నాలుగేళ్లకు పైగా కావడంతో కల్పన తాలూకు ఎముకలు కూడా నశించిపోయాయి. కేవలం నాడు కల్పన ధరించిన దుస్తులు చీకిపోయిన స్థితిలో లభించాయి. వాటితో పాటు ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల కోసం కొన్ని నమూనాలను మాత్రమే పోలీసులు బయటకు తీసుకువచ్చారు.

హాజీ పూర్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం .. గ్రామంలో బావులను చూస్తే భయం
శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.గ్రామంలో బావులను చూస్తేనే భయపడుతున్నారు. ఎంత కాలంగా శ్రీనివాస రెడ్డి ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడు. వీరు ముగ్గురు కాక ఇంకా ఎవరైనా చిన్నారులు శ్రీనివాస రెడ్డి బారిన పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా బయటపడుతున్న మానవ మృగం అరాచకాల నేపధ్యంలో గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications