కాంగ్రెస్ ఖతం.!నివేదికలు ఇవ్వడంలో ఇంఛార్జ్ లు ఫెయిల్.!సరైన కమిటీ వేయాలని అదిష్టానానికి వీహెచ్ లేఖ.!
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపుడుతోందని, వరుస ఓటములు చవిచూస్తున్నా సమీక్షా సమావేశాలు నిర్వహించే నాథుడే లేడని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేసారు. 2018 ముందస్తు సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి మొన్నటి నాగార్జున సాగర్ ఉపఎన్నిక వరకూ అన్నీ ఓటములే ఎదురయ్యాయని, అయినా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు ఒక్క సమవావేశం కూడా నిర్వహించలేదని, ఇలా అయితే పార్టీ మరింత భూస్థాపితం అవుతుందని హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ అదిష్టానానికి లేఖ రాసారు.
వైఫల్యాల దిశగా తెలంగాణ కాంగ్రెస్.. పట్టించుకోవాలని అధిస్టానానికి వీహెచ్ లేఖ..
పార్టీ వ్యవహారాల ఇంఛార్జులుగా నియమించబడుతున్న వారు అదిష్టానానికి సరైన నివేదికలు ఇవ్వడం లేదని, స్ధానికి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నాలను చేయడం లేదని లేఖలో వి.హనుమంత రావు పేర్కొన్నారు. ఇంచార్జులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అన్ని వర్గాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవాలని, గ్రమస్థాయి కార్యకర్తల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, కాని ప్రస్తుత ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ ఆవిధంగా చేయడం లేదని, ఏకపక్ష నిర్ణయాలతో అదిష్టానాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వి.హనుమంతరావు ఘాటు విమర్శలు చేసారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టీ పరాభవాల పైన ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
2018నుండి కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవుతోంది.. పట్టించుకునే నాథుడే లేడన్న వీహెచ్..
ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ 2018లో 19మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి, 12మంది అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మారిపోయారని, అయినప్పటికి పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోడం బాధాకరమని వీహెచ్ ఏఐసీసీకి రాసిన లేఖలో పేర్కోన్నారు.ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మొదట ఇల్లు చక్కదిద్దుకోవలని సూచించారని, కానీ తెలంగాణ పార్టీ ఏమాత్రం ఆ సూచనను పట్టించుకోవడంలేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేసారు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి వరుస ఎన్నికల్లో పార్టీ ఓడిపోతున్న రివ్యూలు లేవని, నాడు ఆర్సీ కుంతియా, నేడు మనిక్కమ్ రివ్యూలు చేయడం మర్చిపోయారని విమర్శించారు. అంతే కాకుండా పార్టీకి బిసిలు దూరం అవుతున్నారని, ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని వీహెచ్ తెలిపారు.
సరైన నివేదికలు ఇవ్వడంలో మనిక్కమ్ విఫలం.. కొత్త కమిటీ వేసేముందు అధిష్టానం ఆలోచించాలన్న పెద్దాయన..
కాగా అధికార టీఆరెఎస్ పార్టీలో ఈటల రాజేందర్ పార్టీ నుండి వెళ్లిపోతే మరో బీసీ నాయకుడు ఎల్.రమణను తీసుకునేందుకు సీఎం చంద్రశేఖర్ రావు సన్నాహాలు చేస్తున్నారని, అది ఆ పార్టీకి ఉన్న ముందు చూపని వీహెచ్ తెలిపారు. టీఆరెఎస్ పార్టీ బిసిల విలువను గుర్తించిందని వీహెచ్ అన్నారు. కేరళలో పార్టీ ఓటమి చెందగానే కొత్త కమిటీని ప్రకటించిందని, తెలంగాణ లో 2018 నుండి కొత్త కమిటీ ప్రకటించక పోవడం శోచనీయమని తెలిపారు. ఇంచార్జ్ లు వస్తున్నారు పోతున్నారు తప్ప పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందుతున్నారని మండిపడ్డారు.
పార్టీకి బీసీలు దూరమవుతున్నారు.. నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్న వీహెచ్..
పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఓడిపోతే కూడా రివ్యూ లేదని, ప్రజల్లో మార్పు వస్తే ఆ మార్పును మన పార్టీ వైపు మళ్లించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వీహెచ్ సూచించారు. పార్టీలో సమస్యలు చర్చించకుండ కొత్త కమిటీ ప్రకటిస్తే ఎలా అని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీని కాపాడడానికి తాను ఎప్పుడూ సిద్దంగా ఉంటానని వీహెచ్ తెలిపారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న వైఫల్యాలపై చర్చ జరపాలని తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ తోపాటు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖలో వీహెచ్ పేర్కొన్నారు.