ఆదివాసీలకు బాసటగా .. కరోనాపై పోరాటంలో ఎమ్మెల్యే సీతక్క.. ఏం చేస్తున్నారంటే !!
ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒకపక్క కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తుందని ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కానీ చాలా వరకు గిరిజన గ్రామాలలో , పలు ఏజెన్సీ గ్రామాలలో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు కూడా లభించని పరిస్థితి వారికి ఇబ్బందికరంగా తయారైంది . ఇక మంత్రులు మాత్రమే పర్యటనలు చేస్తూ హడావుడి చేస్తుంటే ఎమ్మెల్యేలు చాలా వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కానీ ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రం వీరోచితంగా తన నియోజకవర్గ ప్రజల కోసం పోరాటం సాగిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్ .. ఖాళీగా ప్రైవేట్ ఆస్పత్రులు ... కిటకిటలాడుతున్న సర్కారీ ఆస్పత్రులు
ములుగులో కరోనా ఎఫెక్ట్ .. ప్రజలకు ఇబ్బందులు
ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే . జిల్లాలో ఏటూరునాగారం, పస్రా ప్రాంతాలకు చెందిన కిరాణా షాపులు నిర్వహిస్తున్న వారికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. వీరు కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైనట్లు వెల్లడించారు. ఐతే వీరికి కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో కరోనా పాజిటివ్ రావటంతో బాధితుల కుటుంబ సభ్యులను, వారితో దగ్గరగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ఇక దీంతో ములుగులో నో మూవ్ మెంట్ జోన్ గా ప్రకటించి ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు . ఇక ఈ సమయంలో ఎమ్మెల్యే ప్రదర్శిస్తున్న స్ఫూర్తి గుర్తించదగినది .
ట్రాక్టర్ నిత్యావసరాలు తీసుకెళ్ళి ఆదివాసీలకు బాసటగా ఎమ్మెల్యే సీతక్క ..
నిత్యావసరాలు దొరక్క ఇబ్బందిపడుతున్న గిరిజనుల కష్టాలు తీర్చటానికి నడుం బిగించారు సీతక్క . తమ నియోజకవర్గ ప్రజల కోసం ఆమె ట్రాక్టర్ లో నిత్యావసరాలు తీసుకుని నియోజకవర్గంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకు, గుత్తికోయలకు అందిస్తున్నారు .అంతే కాదు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైనదో ఆమె గుత్తికోయలకు అర్ధం అయ్యేలా చెప్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని పేర్కొన్నారు . కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కానీ మందులు కానీ లేవు అని నివారణ ఒకటే మార్గమని చెప్తున్న ఎమ్మెల్యే సీతక్క ఒకరి నుండి ఒకరికి తొందరగా వ్యాపించే అంటూ వ్యాధి అని చెప్పి స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించాలని చెప్తున్నారు. వారికి నిత్యావసరాలతో పాటు మాస్కులు కూడా అందిస్తున్నారు.
ఏజెన్సీ గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు , కూరగాయలు
అమాయక గిరిజన గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు తమ పరిస్థితి చెప్పి వాపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించిన సర్కార్ ఆదివాసీ గ్రామాల ప్రజలను పూర్తిగా విస్మరించింది. అయినప్పటికీ ప్రతి రోజూ ఎమ్మెల్యే సీతక్క మాత్రం ట్రాక్టర్ నిండా నిత్యావసర వస్తువులు , కూరగాయలు తీసుకుని ఏజెన్సీ గ్రామాల ప్రజలకు అందిస్తున్నారు. తమ వారిని ప్రజా ప్రతినిధిగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు . నిరుపేదల కోసం ఇది చేస్తున్నాం , అది చేస్తున్నాం అని చెప్తున్న తెలంగాణా సర్కార్ ఆదివాసీలపై దృష్టి పెట్టాలని, వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఇలాంటి కష్ట కాలంలో ప్రభుత్వ బాసట అవసరం అని ఆమె పేర్కొన్నారు .
ఆదివాసీలను ఆదుకోవాలని ప్రభుత్వానికి సీతక్క విజ్ఞప్తి
లాక్డౌన్ కారణంగా ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారాంతపు సంతలు మూసివేయటంతో నిత్యావసరాలు దొరకక అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి గిరిపుత్రులు జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఇక వారికి ప్రభుత్వ సాయం అందేలా అధికారులను ఆదేశించాలని ఆమె కోరుతున్నారు. ఆదివాసి, గొత్తికోయల గూడాలకు నడుచుకుంటూ వెళ్లి నిత్యావసర వస్తువులను సీతక్క పంపిణీ చేశారు. ఆదివాసీలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సీతక్క కోరుతున్నారు .