ఇందల్వాయి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు: మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం, ఆమె భర్త ఆత్మహత్య
నిజామాబాద్: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ప్రొబేషనరీ ఎస్సై శివప్రసాద్ రెడ్డిపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. ఓ మహిళా కానిస్టేబుల్తో శివప్రసాద్ రెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆమె భర్త శివాజీరావు శారీరక, మానసకి వేధింపులకు గురయ్యాడు. ఈ క్రమంలో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ నేపథ్యంలో ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన కామారెడ్డి జిల్లా గాంధారి పోలీసులు.. ఏ1గా మహిళా కానిస్టేబుల్, ఏ2గా శివప్రసాద్ రెడ్డిని చేర్చారు. వివరాల్లోకి వెలితే.. గాంధారి మండలం మధవపల్లిలో రెండు రోజుల క్రితం శివాజీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామస్తులు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఆందోళన నిర్వహించారు.
గాంధారి-కామారెడ్డి ప్రధాన రహదారిపై రాళ్లు, ముళ్ల కంపలు అడ్డంగా వేసి రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు సదరు ఎస్సైపై చర్యలకు ఉపక్రమించారు. ఎస్సై శివప్రసాద రెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం సీపీ కార్తీకేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ సాక్ష్యాలు రుజువైతే 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. ఉద్యోగం నుంచి కూడా పూర్తిగా తొలగించే అవకాశం ఉంది.
కరీంనగర్ జిల్లావీణవంక మండలం నర్సింగ్పల్లి గ్రామానికి చెందిన శివప్రసాద్ రెడ్డి 2019 డిసెంబర్లో ప్రొబేషనరీ ఎస్సైగా ఇందల్వాయిలో నియమితులయ్యాడు. అయితే, ఈ సమయంలోనే విచ్చలవిడిగా వసూళ్ల కార్యక్రమాలు చేపట్టినట్లు, భూ దందాలు సెటిల్ చేసినట్లు ఆరోపణలుండటం గమనార్హం. అంతేగాక, మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమె భర్త బలవన్మరణానికి కారణమయ్యాడు.