india china standoff: హైదరాబాద్ వ్యాపార సంఘాల సంచలన నిర్ణయం
హైదరాబాద్: దేశ సరిహద్దులో చైనా దళాలు దాడులకు పాల్పడి 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న డ్రాగన్ దేశంపై సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాపారుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లో హోల్ సేల్ మార్కెట్, మధ్యతరగతి షాపింగ్కు అడ్డాగా ఉన్న
బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్ ఖానా హోల్ సేల్ వ్యాపారస్తులు చైనా ఉత్పత్తులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చైనా ఉత్పత్తులను విక్రయించకూడదని ఒప్పందం చేసుకున్నారు.

కాగా, ఈ ప్రాంతాల్లో చైనా నుంచి దిగుమతి చేసుకునే ఆట బొమ్మలు, గాజు వస్తువులు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా విక్రయిస్తుంటారు. ఇతర
ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు ఇక్కడి హోల్ సేల్ మార్కెట్లో వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే, మూడు రోజుల క్రితం గల్వాన్ లోయలో భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి 20 మంది వీరమరణం పొందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే వ్యాపారస్తులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దాడుల నేపథ్యంలో చైనాపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనేక మంది చైనా వస్తువులను వాడకూడదని, కొనుగోలు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రమంత్రులు కూడా చైనా ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇది ఇలావుండగా, కరోనా మహమ్మారి హైదరాబాద్ నగరంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని స్వచ్ఛంద ఆంక్షలను నిర్ణయించుకున్నారు వ్యాపారస్తులు. కరోనా కట్టడికి తమవంతుగా ఈ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications