భారత రాజ్యాంగం వల్ల హిందూయిజం ధ్వంసం: సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వర రావు షాకింగ్
హైదరాబాద్: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి, కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ మాజీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూయిజం ధ్వంసం కావడానికి భారత రాజ్యాంగం కారణమని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని ఆర్టికల్స్.. దీనికి కారణమౌతోన్నాయని చెప్పారు. సో కాల్డ్ ముస్లిం, క్రిస్టియన్ల తరహాలో మైనారిటీలు తమ సొంత మత గ్రంధాలపై అధ్యయనం చేయడానికి వెసలుబాటును కల్పించిన ఆ ఆర్టికల్స్..అదే తరహా విధానాన్ని హిందువులకు వర్తింపజేయట్లేదని అన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ ప్రకటనను పోస్ట్ చేశారు.
జగన్ సర్కార్ కేబినెట్ అజెండాను నారా లోకేష్ ఫిక్స్ చేశారా?: ఆత్మలతో మాట్లాడ్డం ఆపి..!
Constitution destroying Hinduism 👇 pic.twitter.com/k8zoGedBqr
— M. Nageswara Rao IPS(R) (@MNageswarRaoIPS) June 30, 2021
కనీసం వెయ్యి గంటలు మత గ్రంధాలపై అధ్యయనం..
రాహుల్ ఈశ్వర్తో నిర్వహించిన ట్విట్టర్ స్పేస్ డిస్కషన్లో చర్చకు వచ్చిన అంశాలను నాగేశ్వర రావు తన ప్రకటనలో పొందుపరిచారు. దేశంలో- ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు.. 18 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకోవడానికి ముందే తమ మత గ్రంధాలను చదవడానికి, దానికి సంబంధించిన ప్రత్యేక విద్యను అభ్యసించడానికీ వెయ్యి గంటల పాటు సమయాన్ని కేటాయించే అవకాశం ఉందని అన్నారు. సాధారణ పాఠశాలలు, విద్యాసంస్థల్లో చదువుకుంటోన్నప్పటికీ.. తమ సొంత మతానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్లో అభ్యసించే వీలు ఉందని చెప్పారు.
ఆ వెసలుబాటు విద్యార్థులకేదీ?
అదే తరహా వెసలుబాటు హిందూమతానికి చెందిన విద్యార్థులకు లేదని అన్నారు. సాధారణ విద్యాసంస్థలు, పాఠశాలల్లో చదువుకునే ఓ సాధారణ హిందూ విద్యార్థికి తన సొంత మతానికి సంబంధించిన అంశాలను బోధించడానికి ఎలాంటి మతపరమైన ఇన్స్టిట్యూషన్లు లేవని అన్నారు. హిందూయిజాన్ని చదువుకుని..దాన్ని అర్థం చేసుకోవడానికి, హిందూ నాగరికతపై అవగాహన, పట్టు పెంచుకోవడానికి ఉద్దేశించిన వెసలుబాటు లేదని చెప్పారు. ఫలితంగా హిందూ విద్యార్థులు తమ మతం, సంస్కృతీ సంప్రదాయాలు, కళలను మూలాల్లోంచి పట్టును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఎం నాగేశ్వర రావు పేర్కొన్నారు.
ఏ దేశమైనా అదే పనిచేస్తుంది గానీ..
ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న అన్ని గ్రంధాల్లో రుగ్వేదం..ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదిగా గుర్తింపు పొందిందని, అత్యధిక, సుదీర్ఘమైన పద్యాలు ఉన్న పుస్తకం మహాభారతం ఒక్కటేనని అన్నారు. ఇస్లామిక్ ఆక్రమణదారులు.. క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన బ్రిటీషర్ల పరిపాలనలో లక్షలాది తాళపత్ర గ్రంధాలు ధ్వంసమైన తరువాత కూడా.. హిందూయిజం చెక్కు చెదరకుండా నిలిచి ఉందని ఎం నాగేశ్వర రావు అన్నారు. తన చరిత్రను, ప్రాచీన నాగరికతను, వారసత్వంగా వస్తోన్న చారిత్రక సంపదను ముందు తరాల వారికి పాఠ్యాంశాల రూపంలో బోధించడానికి ఏ దేశమైనా ప్రాధాన్యత ఇస్తుందని, భారత్లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి- హిందూ విద్యార్థులు.. తమ మతంపై పట్టును కోల్పోతోన్నారని అన్నారు.
ఆ ఆర్టికల్స్ వల్లే..
దీనికి కారణం- రాజ్యాంగంలోని 28, 29, 30 ఆర్టికల్స్ కారణమని ఎం నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు. ముస్లిం, క్రిస్టియన్ల వంటి మైనారిటీ విద్యార్థులుతమ సొంత మత గ్రంధాలపై అధ్యయనం చేయడానికి రాజ్యాంగం కల్పించిన వెసలుబాటు హిందువులకు వర్తించట్లేదని అన్నారు. ఈ కారణం వల్ల దేశంలో హిందూయిజం ధ్వంసం కావడానికి రాజ్యాంగం ఓ కారణమైనట్లు తాను భావిస్తున్నానని చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఐపీఎస్ వంటి అత్యున్నతమైన హోదాలో పనిచేసిన అధికారికి రాజ్యాంగం పట్ల అవగాహన లేదని అంటోన్నారు.