కేంద్ర రైల్వే కీలక నిర్ణయం : తెలుగు రాష్ట్రాలకు ప్రైవేట్ రైళ్లు.. ఏయే మార్గాల్లో?
కొత్త సంవత్సరంలో దేశ రైల్వే స్థితి గతులను మార్చేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలలో ఇందుకోసం టెండర్స్ పిలిచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య అప్రైజల్ కమిటీ డిసెంబర్ 19న గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ప్రైవేట్ రైళ్ల మార్గాల్లో సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రతిపాదన కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఢిల్లీ-లక్నో మధ్య ప్రైవేట్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 24న దీన్ని ప్రారంభించారు. రెండో ప్రైవేట్ రైలు అహ్మదాబాద్-ముంబై మార్గంలో జనవరి 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ఏయే రూట్లలో ప్రైవేట్ రైళ్లు :
పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ రైల్వే అధికారి ఏయే రూట్లలో ప్రైవేట్ రైళ్లు రాబోతున్నాయో వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ముంబై-కోల్కతా, ముంబై-చెన్నై, ముంబై-గువాహటి, న్యూఢిల్లీ-ముంబై, తిరువనంతపురం-గువాహటి ,న్యూఢిల్లీ-కోల్కతా, న్యూఢిల్లీ-బెంగళూరు, న్యూఢిల్లీ-చెన్నై, కోల్కతా-చెన్నై, చెన్నై-జోధ్పూర్ మార్గాల్లో ప్రైవేట్ రైళ్లు రాబోతున్నాయి.

సికింద్రాబాద్ నుండి విశాఖ,చెన్నైలకు..
కొత్తగా రాబోతున్న ప్రైవేట్ రైళ్లు సికింద్రాబాద్-విశాఖపట్నం,సికింద్రాబాద్-చెన్నై మార్గాల్లోనూ అందుబాటులోకి రానున్నట్టు సదరు అధికారి తెలిపారు. అలాగే ముంబై-వారణాసి,ముంబై-పుణే,ముంబై-లక్నో,ముంబై-నాగ్పూర్,పాట్నా-బెంగళూరు,పుణే-పాట్నా,చెన్నై-కోయంబత్తూరు,సూరత్-వారణాసి,భువనేశ్వర్-కోల్కతా మార్గాల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే న్యూఢిల్లీ-పాట్నా,అలహాబాద్,అమృత్సర్,చంఢీఘర్,గోరఖ్పూర్,భాగల్పూర్ మార్గాల్లోనూ ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

కమర్షియల్గా వర్కౌట్ అయ్యే మార్గాల్లోనే..
వాణిజ్యపరంగా వర్కౌట్ అయ్యే మార్గాల్లోనే ప్రైవేట్ రైళ్లను తీసుకురాబోతున్నారు. ప్రతిపాదించిన 100 ప్రైవేట్ రైలు మార్గాల్లో 35 మార్గాలు ఢిల్లీతో కనెక్టివిటీ ఉన్నవే. 26 మార్గాలు ముంబైతో,12 మార్గాలు కోల్కతాతో,11మార్గాలు చెన్నైతో,8మార్గాలు బెంగళూరుతో కనెక్టివిటీ ఉన్నవి. మిగతా మార్గాలు కూడా మెట్రోపాలిటన్ నగరాలతో కనెక్టివిటీ ఉన్న మార్గాలే కావడం గమనార్హం.

ధ్రువీకరించిన రైల్వే బోర్డు చైర్మన్ :
150 ప్రైవేట్ రైళ్ల ప్రతిపాదనలను రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ సైతం ధ్రువీకరించారు. ప్రస్తుతం ఏయే మార్గాల్లో ప్రైవేట్ రైళ్లను నడపాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. 150 ప్రైవేట్ రైళ్లకు ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య అప్రైజల్ కమిటీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందన్నారు. 10-15రోజుల్లో టెండర్స్ పిలిచే అవకాశం ఉందన్నారు. భారతీయ రైల్వే చరిత్రలో ఇదో మైల్ స్టోన్గా నిలిచిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications