ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇందిర వారసురాలు..! వచ్చే నెలలో పదవీ బాధ్యతలు స్వీకరణ..!!
ఢిల్లీ/ హైదరాబాద్ : దివంగత ఇందిరా గాంధీ మనవరాలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ప్రియాంకా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రియాంకను కాంగ్రెస్ రంగంలోకి దించింది. ప్రియాంకా గాంధీ సమర్థురాలని ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కొనియాడారు. నా సోదరి నాతో పాటు కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. పేదల సంక్షేమం, బాగు కోసం బాగా పనిచేస్తుందని కితాబునిచ్చారు. ఉత్తర ప్రదేశ్ లో ప్రియాంక కు కీలక బాధ్యతలు అప్పగించాం, ఆ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆమెకు తెలుసు అని రాహుల్ అనడం విశేషం..!
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రూపాన్ని తలపించే ప్రియాంకా గాంధీకి పదవి కట్టబెట్టడంతో పాటు క్రియాశీల రాజకీయాల్లోకి రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం రనిపిస్తోంది. యూపీ తూర్పు ప్రాంతానికి బీజేపీ తరఫున యోగీ ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తుండగా, ఆయనకు వ్యతిరేకంగా ప్రియాంక ను రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రియాంక ప్రవేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోహ్రా మాట్లాడుతూ, చాలా కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. ఇదిలా ఉండగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ ని నియమించడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. క్రియాశీల రాజకీయాలకు రావడం పట్ల స్వాగతం తెలిపారు. ఆమె రాకతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేసారు.