రాహుల్ రాకతో ఆ రెండు పార్టీలకు దడ.!అభద్రతాభావం ఆవహించింది.!బీజేపి,టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్.!
హైదరాబాద్ : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయంటున్నారు కాంగ్రెస్ అగ్ర నేతలు. తెలంగాణ హక్కుల కోసం మీరెప్పుడైనా గొంతెత్తారా అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడుగుతున్నారని, రాహుల్ తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తున్నాని, స్క్రిప్టు చదివి బిర్యాని తీని వెళ్తాడని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు కలిసి ఏడున్నరేళ్లుగా తెలంగాణకు చేసిన అన్యాయం ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ తప్పుల్ని ఎవరైనా ఎత్తిచూపితే కనీస సహనం పాటించలేని స్థాయికి బీజేపి, గులాబీ పార్టీలు దిగజారిపోయాయని తెలంగాణ కాంగ్రెస్ ఘాటు కౌంటర్ ఇస్తోంది.
మీకెందుకో ఉలిక్కిపాటు..?
ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న రాహుల్ తెలంగాణ పర్యటన పట్ల రెండు పార్టీలు ఎందుకు ఉలిక్కి పడ్డాయని టిపీసిసి నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు జనాన్ని అంధకారంలో నెట్టేసి, చీకటి స్నేహంతో రాజ్యమేలుతున్నారని ఘాటుగా విమర్శిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.
ఇటు రావణ కాష్టంలా రగులుతున్న తెలంగాణలో జనం గోడు వినడానికి రాహుల్ వస్తే నేరమా? ఆరుగాలం పండించిన పంట కొనుగోలు బాధ్యత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవడంతో అన్నదాత బతుకు అగమ్యగోచరంగా మారాయని టీ కాంగ్రెస్ వివరిస్తోంది.
బీజేపీ,టీఆర్ఎస్ వికృత రాజకీయ క్రీడ..
అన్నదాత పట్ల బాధ్యత నీదంటే, నీదంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు నెపం మోపుకుంటుంటే, ఆ రాజకీయ వికృత క్రీడకు బలై, మట్టిని నమ్ముకున్న రైతులు మన్నులో కలిసిపోతున్నా ఈ రెండు పార్టీలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు కాంగ్రెస్ నేతలు. పంట కుప్పలపై గుండెలు ఆగి చనిపోతున్నా, ప్రభుత్వ అలసత్వంతో నకిలీ విత్తనాలు, పురుగు మందుల కంపెనీలు రైతుల్ని నిండా ముంచుతున్నా, అప్పులపాలై రైతులు అసువులు బాస్తున్నా, రైతులు పుట్టెడు కష్టంలో ఉన్నా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రైతుల కుటుంబాల గోడు రాహుల్ తెలుసకోవడం ఘోరమా? దేశ ద్రోహమా అని సీఎం చంద్రశేఖర్ రావును, ప్రధాని మోదీని కాంగ్రెస్ నిలదీస్తోంది.
ఏడేళ్ల క్రితం మీ ఆస్తులెంత..!
తెలంగాణకు రాహుల్ ఎందుకొచ్చారని అనడానికి ఇదేమైనా చంద్రశేఖర్ రావు రాజ్యమా..? అని టీపిసిసి నేతలు నిలదీస్తున్నారు. రాహుల్ ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదని బీజేపీ లీడర్లు ప్రశ్నించేందుకు ఇదేమైనా మోదీ సామంత రాజ్యమా.?అని ప్రశ్నిస్తున్నారు. నియంతృత్వ పాలనతో జనం రక్తం పిండి, చంద్రశేఖర్ రావు దోచుకున్న సొమ్ములో బీజేపీకి కడుతున్న కప్పం ఎంత అని కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తోంది.
ఏడేళ్ల క్రితం చంద్రశేఖర్ రావు కుటుంబం పరిస్థితి ఏంటి..? రాజకీయ లాభనష్టాల గురించి ఆలోచించకుండా, ఇచ్చిన మాట కోసం, తెలంగాణ ప్రజల ఉద్యమస్ఫూర్తిని గౌరవించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన నాడు, చంద్రశేఖర్ రావు కుటుంబం ఆస్తులెంత..? ఇప్పుడెంత..? ఇవన్నీ జనాన్ని దోచుకున్న సొమ్ము కాదా? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
ఇందుకేనా తెలంగాణ ఇచ్చింది..?
కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది చంద్రశేఖర్ రావు కుటుంబం దోచుకోవడడానికి కాదని, నియంతృత్వంగా పాలించడానికి అసలే కాదని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఇదే అంశాన్ని స్పష్టం చేసారని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. ప్రజలు కొట్లాడింది, రక్తం దారపోసింది, గడీల పాలన కోసం కాదని, జనం కోసమని, అలాంటి జనాలు నేడు దిక్కుతోచని స్థితిలో ఉంటే కాంగ్రెస్ చూస్తూ ఉండాలా..? కష్టాల పాలైన జనాల కన్నీళ్లు తుడవొద్దా? సబ్బండ వర్ణాల సంగ్రామ పోరాటానికి సమరశంఖం పూరించేందుకే రాహుల్ గాంధీ వచ్చారని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగాల కుటుంబం గాంధీ, నెహ్రూ కుటుంబమని, దేశానికి అన్నంపెట్టే రైతన్న తరఫున గళం వినిపించేందుకు, దొరపాలనకు చరమగీతం పాడేందుకే రాహుల్ గాంధీ పర్యటించారని టీఆర్ఎస్, బీజేపి నేతలకు ఘాటు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు కాంగ్రెస్ నాయకులు.