ఇంటర్ బోర్డా మజాకా .. సప్లమెంటరీ పరీక్షలకు ఒకే స్టూడెంట్ కు రెండు హాల్ టికెట్స్
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న ఇంటర్ బోర్డు ఏ మాత్రం మారలేదు. వరుస తప్పిదాలతో విద్యార్థులను గందరగోళంలో పదేస్తూనే ఉంది. నిన్నటికి నిన్న ప్రశ్నా పత్రాలు మాయం అయినా సోయి లేని ఇంటర్ బోర్డు ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష నిర్వహణకు సంబంధించి హాల్ టికెట్ల ఇష్యూలో కూడా విద్యార్థులను టెన్షన్ పెడుతుంది.
ఇంటర్ బోర్డులో మరో కలకలం ... పోలీస్ స్టేషన్ లో సప్లమెంటరీ ప్రశ్నాపత్రాలు మాయం
ఇంటర్మీడియట్ బోర్డు తప్పుల తడకగా మారిపోయింది . తాజాగా ఒకే విద్యార్థికి రెండు హాల్టికెట్లు జారీ చేసిన వైనం ఇంటర్ బోర్డు పై విద్యార్థులు ఆగ్రహానికి కారణం అవుతుంది. . జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన వినోద్ 2015-17 సంవత్సరంలో మెట్పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. కెమిస్ట్రీ ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఫీజు చెల్లించాడు. ఈ నెల 12న పరీక్ష రాయాల్సి ఉండటంతో హల్టికెట్ డౌన్చేసుకున్న సదరు విద్యార్ధి షాక్కు గురయ్యాడు. ఇంటర్ బోర్డు రెండు హాల్ టికెట్లు జారీ చేయడమేకాక నంబర్లు, పరీక్ష కేంద్రాలు వేర్వేరుగా కేటాయించడంతో ఏం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో అవాక్కవటం వినోద్ వంతయ్యింది .
ఏ కేంద్రంలో పరీక్ష రాయాలో తెలియక వినోద్ అయోమయానికి గురవుతున్నాడు. ఇంటర్ బోర్డు అధికారులు పొరబాటును గుర్తించి ఇప్పటికైనా తనకు ఒకే హాల్ టికెట్ కేటాయించాలని కోరుతున్నాడు. లేకుంటే తాను ఈ విద్యా సంవత్సరం కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుందని బాధ పడుతున్నాడు. నిన్నటికి నిన్న వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్కు ఇటీవలే సప్లిమెంటరీ ప్రశ్నాపత్రాలు వచ్చాయి. అయితే అందులో ప్రశ్నాపత్రాలకు సంబంధించిన రెండు బాక్సులు కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపింది . ఇక తాజాగా ఒకే స్టూడెంట్ కు ఒకే పరీక్షకు రెండు హాల్ టికెట్లు రెండు వేర్వేరు హాల్ టికెట్ నంబర్లతో, రెండు వేర్వేరు సెంటర్లలో కేటాయించటం హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్ బోర్డు ఏం చేసినా మారదు అని కొందరు అసహనం వ్యక్తం చేస్తుంటే ఇంటర్ బోర్డా మజాకా అంటున్నారు విద్యార్థులు.