కడియం తెలుసంటూ లక్షల్లో మోసాలు: ఇంటీరియర్ డిజైన్ జంటపై ఫిర్యాదులు

హైదరాబాద్: నగరంలో వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్న వారి ఆటను పోలీసులు ఎప్పకప్పుడు కట్టిస్తున్నప్పటికీ.. కొత్త రకం మోసాలతో రెచ్చిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా, ఇంటీరియర్ డిజైన్ పేరిట లక్షల్లో కుచ్చుటోపీ పెడుతున్న ఓ జంట వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరి బారినపడిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

చెన్నైకి చెందిన కెనడీ జోసెఫ్, హైదరాబాద్ నగరానికి చెందిన కంతేటి అరుణ కలిసి కొత్తగా భవనాలు, ఫ్లాట్లు నిర్మించేవారిని సంప్రదించి అంతర్జాతీయ హంగులతో ఇంటీరియర్ డిజైన్ చేస్తామని నమ్మబలికి లక్షల్లో మోసం చేస్తున్నారని అత్తాపూర్ కు చెందిన నాగమణి అనే బాధితురాలు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.

అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 155 వద్ద ఉన్న తమ ఫ్లాట్‌కు ఇంటీరియర్ డిజైన్ చేస్తామని రూ. 9లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందులో 5.75 లక్షలు చెల్లించే వరకు తమపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. ఆ తర్వాత పనులు ప్రారంభించలేదని బాధితురాలు వాపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మరో 15రోజుల్లో పని ప్రారంభిస్తారని చెప్తూ దాదాపు రెండేళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. కాగా, ఈ జంట బారిన పడిన బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

నిందితుల వివరాల్లోకి వెళితే.. రఫెల్ కెనడీ 10వ తరగతి మాత్రమే అయినా.. మాసబ్‌ట్యాంక్ జేఎన్టీయూ ఆర్కిటెక్చర్ కాలేజీలో బీఆర్క్ చేశానని చెబుతుంటాడు. అంతేగాక, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్‌లో ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్లు నమ్మబలుకుతాడు. హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన కంతేటి అరుణను తన పీఏగా చెప్పుకుంటూ బాధితులను ఆమె ద్వారా ఉచ్చులో పడేస్తుంటాడు.

Interior frauds: complaint on a couple

గూగుల్‌లోని డిజైన్లను డౌన్ లోడ్ చేసి, వాటిని తామే చేశామని నమ్మిస్తారు. డబ్బులు వచ్చేదాక అరుణను ముందుండి నడిపిస్తాడు. ఆ తర్వాత 60శాతం డబ్బులు అడ్వాన్సుగా తీసుకుని మళ్లీ వారికి కనిపించరు. తాను బెంగళూరు, ముంబై, లక్ష ద్వీప్ లలో బిజీగా ఉన్నానని కొందరు కస్టమర్లకు, సినిమా తారలను కలిసేందుకు ముంబైకి వచ్చానని మరికొందరికి చెప్పి నమ్మిస్తుంటాడు.

ఇలాగే ఏళ్లుగా గడిచినా పని చేయడు. బాధితులు గట్టిగా నిలదీస్తే తన ఆఫీస్ అడ్రస్ మార్చేస్తాడు. ఇలా మారేడ్ పల్లి, నారాయణగూడలో ఆర్కే అసోసియేట్స్ పేరిట మోసం చేసిన జోసేఫ్, అరుణ జంట.. ఆ తర్వాత బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న రిలయన్స్ మానర్‌లో తన కుటుంబం ఉంటున్న ఫ్లాట్‌లోనే రాఫెల్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో కార్యాలయాన్ని తెరిచాడు.

అంతేగాక, మంత్రి కడియం శ్రీహరికి తాను దగ్గరివాడినని, అందుకే ఆయన కూతురు ఫ్లాట్‌లో ఉన్నానని, వారి ఇళ్లకు కూడా తానే ఇంటీరియర్ డిజైన్ చేశానంటూ ఇతర కస్టమర్లను నమ్మిస్తుంటాడు.

కాగా, అసలు విషయం ఏమిటంటే.. కంతేటి అరుణ.. రఫెల్ పీఏ కాదు, అతని రెండో భార్య. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. దమ్మాయిగూడలో అరుణ అక్క పేరుతో కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో అమ్మమ్మ, తాతల ఆ బాబు ఉంటున్నాడు. ఈ జంట మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వారు తమ మకాంను గుంటూరులోని మాచవరానికి మార్చారు.

నూతన రాజధాని అమరావతిలో కొత్త నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉండటంతో అక్కడ తమ మోసాలను కొనసాగించవచ్చనే ఆలోచనతో ఆ కంత్రీ జంట ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ నగరంలో వీరి బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+