మిస్టర్ మురళీ.. యువార్ నాట్ మై జడ్జ్, ఇంటర్వ్యూ ఇంటరాగేషన్లా ఉండొద్దు: ఐలయ్య
జాతీయ మీడియా, అన్ని రాజకీయ పార్టీలు తనపై దాడిని ఖండించలేదన్నారు.
Recommended Video
హైదరాబాద్: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంపై ఎడతెగని చర్చ జరుగుతోంది. బహుజనవాదులు, వైశ్య మద్దతుదారులు స్పష్టంగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
ఆఖరికి తెలంగాణ మేదావుల ఫోరం టీమాస్ లోను లుకలుకలు బయటపడుతుండటం గమనార్హం. లాల్ నీల్ సలాం అంటూ చేతులు కలిపిన మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులకు మధ్య ఈ వివాదం అగాథాన్ని సృష్టించింది. టీమాస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఐలయ్యను ఒంటిరివాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించకమానదు.
ఎవరీ కంచ ఐలయ్య?: వివాదాల చట్రంలోకి ఎలా వచ్చారు..
అటు మీడియా కూడా తనపై దాడిని విస్మరిస్తోందని ఐలయ్య వాపోతున్నారు. తాజాగా టీవి9 ఎన్ కౌంటర్ కార్యక్రమానికి హాజరైన ఆయన జర్నలిస్ట్ మురళీకృష్ణ వ్యాఖ్యలకు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువార్ నాట్ మై జడ్జ్:
అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలతో ఉన్నందునే ఈ పుస్తకంపై విమర్శలు వస్తున్నాయని కంచె ఐలయ్యతో మురళీకృష్ణ ప్రస్తావించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐలయ్య.. 'మిస్టర్ మురళీ... యువార్ నాట్ మై జడ్జ్ నార్ యువార్ మై లాయర్. యువార్ ఏ లాయర్ ఆఫ్ ఆర్యవైశ్య... ఐడోంట్ బాదర్' అంటూ సమాధానం ఇచ్చారు.
'ఇంటర్వ్యూ'.. ఇంటరాగేషన్ కాదు:
తనను మీడియా చానెల్స్ అడుగుతున్న ప్రశ్నలు కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడుగుతున్నట్టుగా ఉన్నాయని, ఈ హక్కు ఎవరికీ లేదని, టీవీ చానల్స్ ఏమీ లాయర్స్ కాదని ఐలయ్య స్పష్టం చేశారు.
'ఆర్యవైశ్యులు మీకు డబ్బిచ్చి పెట్టుకున్నారా? లేదా? నాకు తెలియదు. ఐయామ్ సారీ... ఇంటర్వ్యూ ఇంటరాగేషన్ లా ఉండరాదు. నేను కింది కులపోడిని. ఎన్నడూ రాయని కులపోడిని. కులాలు ఉన్నాయి కాబట్టి చర్చించాల్సిందే. కులాలు ఉన్న చోట వర్గ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి' అని ఐలయ్య చెప్పుకొచ్చారు.
మీడియా పట్టించుకోవడం లేదు:
ఇలా పుస్తకం రాసే హక్కు ఉందా? అని పదేపదే ఎందుకు తనను ప్రశ్నిస్తున్నారని.. 'ఎస్.. నాకు హక్కు ఉంది' అని ఐలయ్య బల్లగుద్ది చెప్పారు. పుస్తకం నచ్చకపోతే కోర్టుకు పోవాలి గానీ తనను టార్గెట్ చేస్తూ హత్యాయత్నాలకు దిగడం ఏంటని ప్రశ్నించారు. తనపై అగ్రవర్ణాలు దాడి జరుపుతూ ఉంటే ఏ మీడియా చానల్ కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మాల, మాదిగలను, సమాజంలో అణగదొక్కబడుతున్న వారి సమస్యలను ఎందుకు బయటకు తీసుకురావడం లేదని ఐలయ్య ప్రశ్నించారు.
లంకేష్లా చంపేస్తారేమో?:
'టీజీ వెంకటేశ్ తనను నడిరోడ్డు మీద నరుకుతానని అన్నాడు. ఎలా నరుకుతారండీ అని టీజీ వెంకటేశ్ ను ఎవరైనా ప్రశ్నించారా? ఆయన మీద డిబేట్ పెట్టారా? జాతీయ మీడియా, అన్ని రాజకీయ పార్టీలు నాపై దాడిని ఖండించలేదు, నేను మరో గౌరీ లంకేష్ అయిన తరువాత స్పందిస్తారేమో' అంటూ ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తనను లంకేష్ కన్నా ఘోరంగా చంపేస్తారేమోనన్న ఆందోళన ఉందని చెప్పారు. అందుకే తాను పోలీసులను ఆశ్రయించానని చెప్పారు.
సెప్టెంబర్ 4వరకు హౌజ్ అరెస్ట్:
తనపై జరుగుతున్న దాడులకు నిరసనగా సెప్టెంబర్ 4వరకు తనను తాను హౌజ్ అరెస్ట్ చేసుకోబోతున్నట్లు కంచె ఐలయ్య ప్రకటించారు. అప్పటివరకు ఏ మీడియా చానెల్ తోను మాట్లాడనని, ఎవరికీ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వనని అన్నారు.