సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్ప్రెస్- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Secunderabad- Divya Dakshin special train: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దివ్య దక్షిణ యాత్ర టూర్ ఇది. తమిళనాడులో గల ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను ఇందులో చేర్చింది ఐఆర్సీటీసీ. అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి పుణ్య క్షేత్రాలు ఇందులో ఉన్నాయి.
భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. మొత్తం ఎనిమిది రాత్రులు/ తొమ్మిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. అక్టోబర్ 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 416, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్కు చర్లపల్లి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంటుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.
తొలుత ఈ ఎక్స్ ప్రెస్ తిరవణ్ణామలైకి చేరుకుంటుంది. అక్కడి అరుణాచలం ఆలయ దర్శనంతో ఈ యాత్ర మొదలవుతుంది. అరుణాచలేశ్వరుడిని దర్శనానంతరం ఈ రైలు చిదంబరానికి చేరుకుంటుంది. అక్కడ వెలిసిన నటరాజస్వామివారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజలు చేయవచ్చు. అనంతరం తిరుచిరాపల్లికి చేరుకుంటుంది. శ్రీరంగనాథస్వామి ఆలయ దర్శనానంతరం తరువాతి గమ్యస్థానం తంజావూరు. బృహదీశ్వర ఆలయాన్ని యాత్రీకులు సందర్శిస్తారు.
అక్కడి నుంచి నేరుగా రామేశ్వరానికి బయలుదేరి వెళ్తుందీ ఎక్స్ ప్రెస్. రామనాథస్వామి దర్శనానంతరం మధురైకి చేరుకుంటుంది. అక్కడ ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారిని యాత్రీకులు దర్శించుకోవచ్చు. దీని తర్వాతి గమ్యస్థానం కన్యాకుమారి. ఇక్కడ రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయ దర్శనం ఉంటుంది. కన్యాకుమారి పర్యటనతో ఈ యాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి తిరిగి సికింద్రాబాద్ కు చేరుకుంటుందీ రైలు.
ఈ టూర్ ప్యాకేజీ ద్వారా దివ్య దక్షిణ యాత్రకు వెళ్లదలిచిన వాళ్లు ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 15,800 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 14,800 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 23,200, పిల్లలకు 22,000 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 29,600, పిల్లలకు 28,100 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.




Click it and Unblock the Notifications