సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్: హాల్ట్ స్టేషన్లు.. !!
Secunderabad- Mata Vaishnodevi tourist special train: సికింద్రాబాద్ నుంచి హరిద్వార్- రిషికేష్- మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మథుర- బృందావన్ వంటి ప్రఖ్యాత పుణ్య క్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. గంగా హారతి దీనికి అదనం. రిషికేష్ లో గంగా హారతిని తిలకించే అవకాశం యాత్రీకులకు లభించింది.. ఈ టూర్ ద్వారా.
భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. 9 రాత్రులు/ 10 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. మే 12వ తేదీన సికింద్రాబాద్ నుండి ఈ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 702 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 160, 3ఏసీ- 490, 2ఏసీ- 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ కు భవనగిరి, జనగాం, ఖాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, వార్ధా, నాగ్ పూర్ స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.

మథుర దర్శనంతో ఈ యాత్ర మొదలవుతుంది. అక్కడ కృష్ణ జన్మభూమిని దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజలు చేయవచ్చు. అనంతరం కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించవచ్చు. అనంతరం బృందావన్ కు వెళ్తుందీ ఈ ఎక్స్ ప్రెస్. అక్కడ బాంకే బిహారీ ఆలయం, ప్రేమ్ మందిర్ లను దర్శించుకునే వెసలుబాటు ఉంది. అక్కడి నుండి నేరుగా మాతా వైష్ణోదేవి ఆలయానికి చేరుకుంటారు యాత్రీకులు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కాట్రా స్టేషన్ కు వెళ్తుంది భారత్ గౌరవ్ ఎక్స్ ప్రెస్.
అక్కడి నుండి కాలినడక/గుర్రం/డోలీపై యాత్రీకులు వైష్ణోదేవి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చును యాత్రీకులు సొంతంగా భరించాల్సి ఉంటుంది. కాట్రా నుంచి వైష్ణోదేవి ఆలయం సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దర్శన టిక్కెట్, హెలికాప్టర్, బ్యాటరీ కారు ఖర్చులను యాత్రీకులు ముందుగానే బుక్ చేసుకోవాలి. https://online.maavaishnodevi.org/ లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
అనంతరం ఈ రైలు హరిద్వార్ కు చేరుకుంటుంది. హర్ కీ పౌరిలో మానసా దేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. గంగా హారతిలో పాల్గొంటారు. దీని తర్వాత రిషికేశ్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడ రామ్ ఝూలా, లక్ష్మణ్ ఝూలాను సందర్శిస్తారు. రిషికేష్ తో ఈ టూర్ ముగుస్తుంది. మళ్లీ సికింద్రాబాద్ కు ఈ రైలు తిరుగు ప్రయాణమౌతుంది.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,500 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,400 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 25,700, పిల్లలకు 24,300 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 33,400, పిల్లలకు 31,800 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రైలు టికెట్లు, రోడ్డు రవాణా, హోటల్ వసతి, భోజనం, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.












Click it and Unblock the Notifications