గవర్నర్ సూచనలను కేసీఆర్ పాటిస్తారా: ముఖ్యమంత్రి తేల్చిందేంటి: ఆర్టీసీలో ఇక జరిగేది అదేనా..!
తెలంగాణ ఆర్టీసీ అంశం మీద ప్రభుత్వ ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు స్పష్టం చేసారు. ఆర్టీసీని కొనసాగించాలంట మోయలేని భారంగా మారిందని అంకెలతో సహా విశ్లేషించారు. ఆర్టీసీకి కావాల్సినంత స్థాయిలో నిధుల సమీకరణ శక్తి ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అనుసరించి తాము రూట్ల ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
అదే సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా.. సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని..ప్రధానంగా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. అయితే, ఆర్టీసీ ఎండీ మాత్రం విధుల్లోకి ఇప్పుడు కాదంటూ స్పష్టం చేసారు. మరి..ముఖ్యమంత్రి కార్మికులను విధుల్లోకి తీసుకుంటూ నిర్ణయిస్తారా..ఆయన ఆర్టీసీ విషయంలో అమలు చేసే ప్రణాళిక ఇదేనా..

భారం మోయలేం..ప్రయివేటీకరణ తప్పదు
ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య ప్రధానంగా ఆర్టీసీ భవిష్యత్తు.. కార్మికులను విధుల్లోకి చేర్చుకోవటం పైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ లో కార్మిక నేతల మొండి వైఖరి..సమ్మె..తాము తీసుకుంటున్న నిర్ణయాలు..ఆర్టీసీలో ఆర్దిక సమస్యలు...బకాయిలు..ఇలా అన్ని అంశాల పైనా గవర్నర్ కు వివరించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని యథాతథంగా నడపటం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పట్లాగే కొనసాగించాలంటే ప్రభుత్వం నెలకు రూ.640 కోట్లు భరించాల్సి ఉంటుందన్నారు. అన్ని నిధులను సమకూర్చుకొనే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పారు. కేంద్రం ఇటీవల సవరించిన మోటారు వాహన చట్టాన్ని అనుసరించి రూట్లపై ఆర్టీసీకి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు.

కార్మికులను విధుల్లోకి తీసుకోండి..
ముఖ్యమంత్రి ఆర్టీసీ ఆర్దిక స్థితి గతుల గురించి చెప్పిన వివరాలను గవర్నర్ సైతం ఆసక్తిగా విన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత పైనే గవర్నర్ చర్చించినట్లు తెలుస్తోంది. చెప్పారు. 48 వేల మంది కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశమైనందున వెంటనే సమ్మెను సామరస్యంగా విరమింపజేయాలని, మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు.
52 రోజుల పాటు సమ్మె జరగడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బ తిందని, పలు గ్రామాలకు రవాణా సదుపాయమే లేకుండా పోయిందని ప్రస్తావించారు. ఆర్టీసీ జేఏసీ కూడా విలీనం అంశాన్ని పక్కన పెట్టిందని, వారిని విధుల్లోకి చేర్చుకున్న తర్వాత మిగిలిన అంశాలపై చర్చలు జరపాలని సూచించారు.

గవర్నర్ సూచనలు అమలు చేస్తారా..
రాజ్ భవన్ లో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ ముఖ్యమంత్రికి సూచిస్తున్న సమయంలోనే కార్మికులు సమ్మె విరమణ నిర్ణయం ప్రకటించారు. కార్మికులు అందరూ ఈ ఉదయం నుండి డిపోల వద్దకు రావాలని సూచించారు. అయితే, ఆ వెంటనే ఇది సాధ్యం కాదని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండి ఒక ప్రకటన విడుదల చేసారు.
అయితే, ఆర్టీసీ కాదన్నా..ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. గవర్నర్ సైతం సూచించటంతో..ముఖ్యమంత్రి కార్మికులతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచన చేయటంతో ఇప్పుడు సీఎం ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసలో ప్రైవేటుకు చోటిస్తూ సంస్థను కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications