తెరాసలోకి వలసలు: కెసిఆర్ విజయం, చంద్రబాబు వైఫల్యమా?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టికెట్ల పంపిణీ జరిగిన తీరుపై ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెరాసలో చేరుతున్నవారిలో, చేరినవారిలో కృష్ణయాదవ్ మొదటివారు కాదు. గతంలో పలువురు తెరాసలోకి అడుగు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు, అభిమానులు అయిన తీగెల కృష్ణా రెడ్డి వంటి శాసనసభ్యులు టిడిపి నుంచి బయటకు వచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాసనసభ్యులను, నాయకులను ఓ పద్ధతి ప్రకారం తెరాస నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా టిడిపిని దెబ్బ కొడుతూ తెరాసలోకి వారిని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ను పార్టీలోకి తీసుకుని ఏకంగా మంత్రిపదవే ఇచ్చారు. ఇప్పుడు ఆయన గ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించి తెరాసను గెలుపు బాటలో నడిపించడానికి సిద్ధపడ్డారు. హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గ పరిధిలో కృష్ణ యాదవ్కు కూడా చెప్పుకోదగిన బలం ఉంది. అటువంటి నాయకుడిని తెలుగుదేశం పార్టీ చేజేతులా దూరం చేసుకుంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో హైదరాబాదుకు చెందిన టిడిపి నాయకులు కాకుండా జిల్లాలకు చెందిన నాయకులు ప్రధాన పాత్ర పోషించడం వల్లనే ఆ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకులను, శాసనసభ్యులను, ఎమ్మెల్సీను తెరాసలోకి రప్పించడంలో కెసిఆర్ విజయం సాధించారని అంటున్నారు.
తెలంగాణలో పార్టీ నాయకులను కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని అంటున్నారు. పార్టీని వీడుతారని సంకేతాలు వచ్చినప్పటికీ వారిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించకుండా వారి మానానికి వారిని వదిలేస్తున్నారని, పార్టీని వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్న నాయకులను నిలువరించడానికి వారితో మాట్లాడిన సందర్భాలు కూడా లేవని అంటున్నారు. దాన్ని చంద్రబాబు వైఫల్యంగా చెబుతున్నారు.
అయితే, అధికార పార్టీకి ఉండే వెసులుబాటు ప్రతిపక్షాలకు ఉండని మాట నిజమే. కెసిఆర్ నేతృత్వంలోని తెరాస అధికారంలో ఉండడం వల్ల ఇతర పార్టీల నాయకులు అటు వైపు చూడడం రాజకీయాల్లో సర్వసాధారణమని, ఇందులో భాగంగానే తెరాసలోకి వలసలు కొనసాగుతున్నాయని అంటున్నారు. ఏమైనా, తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందనేదానిపై దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.












Click it and Unblock the Notifications