సుహాసిని పోటీ: జూ.ఎన్టీఆర్ను చంద్రబాబు సంప్రదించారా, ఆయన అసంతృప్తితో ఉన్నారా?
హైదరాబాద్: మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం బరిలో నిలుస్తున్న నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిపై కుటుంబంలో అసంతృప్తి నెలకొని ఉందా? అంటే కావొచ్చుననే ప్రచారం సాగుతోంది. ఓ సమయంలో ఆమె డైలమాలో పడ్డారనే ప్రచారం కూడా సాగుతోంది.
Recommended Video
ఆదిలోనే దెబ్బ: సుహాసిని గో బ్యాక్ అంటూ కూకట్పల్లిలో నినాదాలు, కారణమిదే
మొత్తానికి తాను కూకట్పల్లి నుంచి బరిలోకి దిగుతున్నట్లు సుహాసిని శుక్రవారం ప్రకటించారు. శనివారం నామినేషన్ వేస్తున్నానని కూడా చెప్పారు. కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆమె రేపు (శనివారం) సమాధానం చెబుతానని అన్నారు. ఈ రోజు ఆమె ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అన్ని విషయాలు రేపు మాట్లాడుతానని చెప్పారు.
జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకు ఇష్టం లేదా?
అయినప్పటికీ, సుహాసిని ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆ కుటుంబంలోని కీలక వ్యక్తులకు ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి. సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఆమె సోదరులు. ఆమె పోటీపై వారు అభ్యంతరం చెప్పారని వార్తలు వచ్చాయి. ఇతర కుటుంబ సభ్యులు కొందరు కూడా నో చెప్పారట. అయితే, ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారా?
హరికృష్ణ మృతదేహాన్ని ఎన్టీఆర్ భవన్ తీసుకు వెళ్లనీయలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారట. సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ తన పదవికి రాజీనామా చేశారని, అయినా చంద్రబాబు మాత్రం ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదని మరికొందరు గుర్తు చేస్తున్నారట.
అధికారికంగా హరికృష్ణ అంత్యక్రియలు
హరికృష్ణ మృతి విషయం తెలిసినప్పటి నుంచి అంత్యక్రియల వరకు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉండి, అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించిందని, కేసీఆర్, కేటీఆర్ స్వయంగా వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారని గుర్తు చేసుకుంటున్నారని చెబుతున్నారు.
కేసీఆర్కు ఎదురెళ్లడం మంచిది కాదు, స్నేహమే బెట్టర్
అంతేకాకుండా, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకు మరో ఇరవై ఏళ్లు సినిమా భవిష్యత్తు ఉంది. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మంచిది కాదని, ఆ ఇద్దరు హీరోలకు పలువురు చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. నందమూరి కుటుంబం ఆస్తులు కూడా హైదరాబాదులో ఉన్నాయి. కేసీఆర్తో రాజకీయ శత్రుత్వం కంటే స్నేహమే మంచిదని పలువురు భావిస్తున్నారట.
జూ.ఎన్టీఆర్ను చంద్రబాబు సంప్రదించారా?
మరోవైపు, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను సంప్రదించిన తర్వాతనే సుహాసినిని చంద్రబాబు బరిలోకి దింపుతున్నారనే వారు లేకపోలేదు. ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించే ముందు కళ్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్లతోనూ చంద్రబాబు సంప్రదించినట్లుగా తెలుస్తోందని చెబుతున్నారు. నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఒకరు పోటీ చేస్తే టీడీపీకే కాకుండా మహాకూటమికి సైతం ఊపు వస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సుహాసిని న్యాయవిద్యలో డిగ్రీ చదివారు. ఆమె మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు.